ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామ మందిరానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో అక్కడ కరోనా కలకలం రేపుతోంది.రామాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించే పూజారులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
దీంతో పూజారి ప్రదీప్ దాస్ కరోనా బారిన పడ్డట్టు తెలిసింది.మరోవైపు ఈ కార్యక్రమంలో భద్రతా విధులు నిర్వర్తించే పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించగా.
వారిలో 16 మంది పోలీసులకు పాజిటివ్ నిర్ధారణ అయింది.దీంతో వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
ఆగస్టు 5 వ తేదీన అయోధ్య లో రామాలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించనున్నారు.ఈ భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు 200 మంది వీఐపీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.కరోనా ఆంక్షల మధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
భూమి పూజ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే పూజారికి కరోనా సోకిన నేపథ్యంలో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని నలుగురు పూజారులు నిర్వహించనున్నారు.వీరిలో ఒకరైన పూజారి ప్రదీప్ దాస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.ప్రస్తుతం అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నారు.అయితే బుధవారం పూజారి ప్రదీప్ దాస్ ను ఇంటర్వ్యూ చేసిన కొందరు మీడియా వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆయోధ్యలో బుధవారం 66 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.నగరంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 605 మంది డిశ్చార్జ్ అయ్యారు.
మరో 375 యాక్టివ్ కేసులు ఉన్నాయి.