రాబోయే రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఒడిశా నుంచి కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్ప పీడన ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దాని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు, పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటి వరకు సాధారణం కంటే 54 శాతం ఎక్కువగా వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
దీనిలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 91 శాతం, అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో 24 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు.మరోవైపు మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాలో చిరుజల్లులు కురిశాయి.
ముఖ్యంగా హైదరాబాద్ లోని ఈసీఐఎల్, కుషాయిగూడ, జవహర్ నగర్ మున్సిపల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.