అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది.సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామ మందిరం నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేసింది.
శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే పలు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఎన్నారైలు రామ మందిర నిర్మాణానికి విరాళాలు అందించారు.
తాజాగా రామ మందిర నిర్మాణానికి బంగారు ఇటుకను బహూకరిస్తున్నట్లు మొగల్ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ ప్రకటించాడు.కేజీ బరువున్న బంగారు ఇటుకను మందిర నిర్మాణంలో వాడాలని పేర్కొన్నాడు.
హిందువుల మనోభావాలను, నమ్మకాన్ని నిలిపే సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నాడు.
అయితే, రామ మందిర నిర్మాణానికి ఎప్పుడెప్పుడు పునాదులు పడతాయని యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు ఆ శుభగడియలు రానే వచ్చాయి.రామమందిరం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మోదీని ఆహ్వానించారు.
ఈ మేరకు ఆగస్టు 5న ఉదయం జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోదీ పాల్గొంటారని సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయడంతో రామ మందిర నిర్మాణానికి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజకు డేట్ ఫిక్స్ చేయడంతో భక్తులందరిలో పండుగ వాతావరణం నెలకొంది.
శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగే ఈ భూమి పూజ కార్యక్రమంలో మోదీతో పాటు మరో 250 మంది అతిథులుగా హాజరుకానున్నారని, హాజరయ్యే వారిలో కేంద్ర మంత్రులు, మందిర నిర్మాణం కోసం పోరాడిన పలు హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరుకానున్నారని ట్రస్ట్ వెల్లడించింది.కాగా, రామ మందిర నిర్మాణం కోసం పనులు వేగవంతం చేయబోతున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.