ప్రేమకు హద్దులు లేవని నానుడి.ఒక ప్రాంతం, వేరొక ప్రాంతమే కాదు, ఏకంగా దేశ, విదేశీయులు కూడా ఒకరితో ఒకరు ప్రేమలో పడొచ్చు.
ఇలాంటి ఉదంతాలు మనకు కొత్తేమి కాదు.అందులోనూ ఆన్లైన్ యుగంలో అయితే ఇంకా తేలికగా ఇలాంటి వివాహాలు జరిగిపోతున్నాయి.
తాజాగా లూడో గేమ్ కారణంగా పాకిస్తాన్కు చెందిన ఒక యువతి భారతీయ యువకుడి ప్రేమలో పడింది.అతడి కోసం సరిహద్దు దాటి మరీ వచ్చేసింది.
అక్కడే వచ్చింది అసలు చిక్కు.ఇప్పుడు జైలు పాలైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఆన్లైన్లో లూడో గేమ్ ఆడుతూ పాకిస్తాన్కు చెందిన ఒక యువతి, ఉత్తర ప్రదేశ్కి చెందిన యువకుడి ప్రేమలో పడింది.దీంతో ఆ యువతి ఎలాగైనా ఇండియాలో ఉన్న తన ప్రియుడ్ని కలుసుకోవాలి కలలు కంది.అయితే, ఇండియా రావడానికి ఆమె వద్ద సరైన డాక్యుమెంట్లు లేవు.దానికి ఓ పధకం వేసింది.వీసా లేకుండా నేపాల్ వెళ్లడం చాలా సులువు కనుక, అలా అక్కడికి వెళ్లి, అక్కడి నుండి ఇండియా చేరుకుంది.
తర్వాత తన ప్రియుడిని కలుసుకుంది.

కథ సుఖాంతం అయిందనుకొని ఇరువురూ పండగ చేసుకున్నారు.అనంతరం ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకొని బెంగళూరులో కాపురం పెట్టారు.మరి విషయం పోలీసులకు ఎలా తెలిసిందేమో గాని, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
పాక్ యువతి సరైన పత్రాలు లేకుండా ఇండియాలో ఉంటోందని పోలీసులు తెలుసుకొని దర్యాప్తు చేసారు. నకిలీ పత్రాలతో ఆమె దేశంలో అక్రమంగా ఉంటుందని ఆమెపై పోలీసులు ఫోర్జరీ కేసు బుక్ చేశారు.
తర్వాత ఇద్దరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.కేసుకు సంబంధించి ప్రస్తుతం ఇద్దరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.