ఉత్తర అమెరికాలో సిక్కులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలు, సిక్కు సమాజం ఎదుర్కొంటున్న అభద్రత గురించి నార్త్ అమెరికా పంజాబీ అసోసియేషన్ ( Punjabi Association of North America )(ఎన్ఏపీఏ) ఆందోళన వ్యక్తం చేసింది.అమెరికన్ సమాజంలో దశాబ్ధాలుగా అంతర్భాగంగా వున్న సిక్కు అమెరికన్ల భద్రత, శ్రేయస్సుపై ఇటీవలి ఘటనలు భయంకరమైన ప్రశ్నలను లేవనెత్తాయని ఎన్ఏపీఏ పేర్కొంది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్కు( Antony Blinken ) నార్త్ అమెరికా పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ ( Director Satnam Singh Chahal )లేఖ రాశారు.ఇటీవలి కాలంలో ద్వేషపూరిత నేరాలు, వివక్ష వంటి సవాళ్లను సిక్కు సమాజం ఎదుర్కొందన్నారు.
వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్ఏపీఏ కోరింది.
శాంతి, సామరస్యం, మానవాళికి సేవ చేసే విలువలకు సిక్కు సమాజం ప్రసిద్ధి చెందిందని చాహల్ పేర్కొన్నారు.
ఉత్తర అమెరికా ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధికి సిక్కులు గణనీయమైన సేవ చేశారని ప్రస్తావించారు.సిక్కులు ఇతర జాతికి చెందిన వ్యక్తులుగా తప్పుగా భావించబడుతున్నారని.తలపాగా, గడ్డం, విశ్వాసానికి సంబంధించి మతపరమైన అంశాలు వీరిని ప్రత్యేకంగా చూపుతున్నాయని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దురభిప్రాయం హింస, వేధింపులు సహా విషాదకరమైన పరిణామాలకు దారి తీసిందని చాహల్ పేర్కొన్నారు.

వైవిధ్యం అనేది అమెరికా బలాల్లో అతి ముఖ్యమైనదని ఎన్ఏపీఏ ( NAPA )దృఢంగా విశ్వసిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని ఆచరించి, హింస, వివక్షకు భయపడకుండా జీవించగలరని చాహల్ చెప్పారు.సహనం, పరస్పర గౌరవం, అవగాహనతో కూడిన వాతావరణాన్ని పెంపొందిస్తూ సిక్కులు, ఇతర మైనారిటీలకు అమెరికన్లు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.సిక్కు సమాజం భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలను అవలంభించాలని బ్లింకెన్ను చాహల్ కోరారు.

కాగా.ఈ ఏడాది జూన్ 30న కూడా యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్కు( Antony Blinken ) ఆయన లేఖ రాశారు.అమెరికాలో సిక్కులపై జరుగుతున్న ద్వేషపూరిత నేరాలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చాహల్ ఆ లేఖలో కోరారు.అమెరికా అభివృద్ధి, వైవిధ్యం, సాంస్కృతిక వికాసంలో సిక్కు సమాజం కీలకపాత్ర పోషించిందని చాహల్ చెప్పారు.
అయినప్పటికీ సిక్కులు వివక్ష, పక్షపాతం, హింసాత్మక చర్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మైనారిటీలపై ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టాలను బలోపేతం చేయడం, నిపుణులతో చర్చలు చేపట్టాలని చాహల్ కోరారు.
సిక్కు మత విశ్వాసాలను తప్పుగా అర్ధం చేసుకోవడం, వారి వేషధారణ, తలపాగా, గడ్డం వంటి వాటితో సిక్కులపై హేట్ క్రైమ్స్ పెరుగుతున్నాయన్నారు.పలు ఘటనల్లో అమాయకులైన సిక్కులు ప్రాణాలు కోల్పోయారని చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు.