2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది.ఈ నేపథ్యంలో ప్రజల్లో తిరగాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.మెరుగైన పనితీరు కనపరచకపోయినా ఇదే చివరి అవకాశమని ఎమ్మెల్యేలకు జగన్ ఖరాఖండిగా చెప్పేశారు.
ఎమ్మెల్యేలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత ప్రభుత్వంపై పడకుండా జగన్ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీమ్ చేసిన సర్వే రిపోర్టును జగన్ బహిర్గతం చేశారు.
ఈ సందర్భంగా ఏయే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనిచేయడం లేదో వచ్చే ఎన్నికల్లో వాళ్లకు టిక్కెట్ ఇవ్వకుండా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.మరోవైపు పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా తమకు బదులుగా తమ వారసులకు ఈసారి అవకాశం ఇవ్వాలని జగన్ను కోరుతున్నారు.
ఇప్పటికే పలువురు నేతల వారసులు వారి నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు, మంత్రుల వారసులు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ జాబితాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వారసులు కూడా ఉన్నారు.అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వారసుడు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో గతంలో స్పీకర్లు తదుపరి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు.దీంతో తమ్మినేని సీతారాం తాను పోటీ చేసే బదులు తన కుమారుడి చేత పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పోటీ చేస్తారంటూ వైసీపీలో ప్రచారం జరుగుతోంది.ఇటీవల వైసీపీ ప్లీనరీలో ఈ విషయాన్ని మాజీ మంత్రి కొడాలి నాని స్వయంగా ప్రకటించారు.అటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తనయుడు అభినయ్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.అంతేకాకుండా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు తన తనయుడిని వచ్చే ఎన్నికల్లో రేపల్లె నుంచి బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు.
ఈ జాబితాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమా కూడా ఉన్నారు.ఇంకా పలువురు నేతలు తమ వారసులను పోటీ చేయించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.