రాజన్న సిరిసిల్ల జిల్లా: వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్(Collector Khemyanayak ) పేర్కొన్నారు.జాతీయ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు.మూల్యం చెల్లించి వస్తువులను కొనుగోలు చేసినా, సేవలను పొందినా అందరూ వినియోగదారులేనని, ఆన్లైన్, ఆఫ్లైన్ , మల్టీలెవెల్ మార్కెటింగ్ తదితర విధానాల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినా అందరూ వినియోగదారులేనని వివరించారు.
అనంతరం సిరిసిల్ల వినియోగదారుల సంఘం బాధ్యులు మాట్లాడారు.వినియోగదారుల రక్షణ చట్టం -2019 అంశాలను వివరించారు.
నాణ్యమైన సరుకులు పొందే హక్కు,ఎంపిక చేసుకొనే హక్కు, సమాచారం పొందే హక్కు, ఫిర్యాదు చేసే హక్కు, నష్టపరిహారం పొందే హక్కు లపై వివరించారు.ఈ చట్ట పరిధిలోకి బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, జీవిత బీమా సంస్థ, రైల్వే, ఎయిర్లైన్స్, ట్రాన్పోర్ట్ సర్వీసు, కొరియర్, విద్యుత్ సంస్థ, హౌజింగ్ బోర్డు, టెలిఫోన్ డిపార్టుమెంట్, గ్యాస్ కంపెనీలు, క్లినికల్ ల్యాబ్స్ ప్రైవేటు ఆసుపత్రులు వస్తాయని తెలిపారు.
ఫిర్యాదు స్థానిక అధికారులకు నేరుగా లేదా సంఘం ద్వారా ఇవ్వవచ్చని పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ కమిషన్, రాష్ట్రస్థాయిలో రాష్ట్రకమిషన్, జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఉంటాయని, రూ .కోటి లోపు కేసులను డిస్ట్రిక్ట్ కమిషన్ కు, రూ.కోటి నుండి రూ.10 కోట్లకు వరకు రాష్ట్ర కమిషన్, రూ.10 కోట్లపైన నేషనల్ కమిషన్ కు నేరుగా లేదా పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.తూనికలు, కొలతలలో మోసాలు, నాణ్యతలేని వస్తువులు, అధిక ధరలు, కల్తీలు, బ్లాక్ మార్కెటింగ్, మోసపూరిత ప్రకటనల నుంచి రక్షించబడాలంటే వినియోగదారుల హక్కులను తెలుసుకోవాలని స్పష్టం చేశారు.వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్లు 1800114000 లేదా 1915 అలాగే వాట్సాఫ్ నంబర్ 8800001915, రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్లు 18004259339 లేదా 1967లో సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి, వినియోగదారుల సంఘం రాజన్న సిరిసిల్ల ప్రెసిడెంట్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.