అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు.ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపిన విషయం తెలిసిందే.
అయితే బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదాస్పద భూమిని తనకప్పగిస్తే అయోధ్యలో మందిర నిర్మాణానికి బంగారు ఇటుకను ఇస్తానని మొఘల్ రాజవంశానికి చెందిన వారసుడు ప్రిన్స్ హబీబుద్దీన్ టూసీ ప్రకటించారు.
కేజీ బరువున్న బంగారు ఇటుకను ప్రధానికి అందిస్తానని, దానిని మందిర నిర్మాణంలో వాడవచ్చని ఆయన తెలిపారు.
ఇది 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను, నమ్మకాన్ని నిలిపి ఉంచుకునే సమయమని అన్నారు.ఈ సందర్భంగా హిందువులకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు.ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరినట్టు తెలియజేశారు.గతంలో హబీదుద్దీన్ టూసీ బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా తనను నియమించాలంటూ డిమాండ్ చేశాడు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న కేసులో తన పేరును కూడా చేర్చాలని టూసీ పిటిషన్ దాఖలు చేశారు.అయితే అది ఇంకా విచారణకు రాలేదని తెలిపారు.సుప్రీం కోర్టు కనుక భూమిని తనకు అప్పగిస్తే ఆలయ నిర్మాణానికి మొత్తం భూమిని ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినట్టు టూసీ తెలియజేశారు.
అయితే టూసీ ఇప్పటికే మూడుసార్లు అయోధ్యను సందర్శించి అక్కడి ఆలయంలో ప్రార్థనలు చేశారు.
గతేడాది ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఆలయ నిర్మాణానికి భూమిని అప్పగిస్తానని హామీ ఇచ్చారు.అంతేకాక అతని తలపై చరణ్-పాదుకలు పెట్టుకుని తెలియజేశారు.అంతేకాదు రాముడి ఆలయాన్ని ధ్వంసం చేసినందుకు హిందూ సమాజానికి క్షమాపణలు తెలిపారు టూసీ.