పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల మీద పడ్డారు.అయితే ఆ మధ్య అవి కాస్తా బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు చోటుచేసుకోవడంతో వెనక్కి తగ్గారు.
అయితే తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో భారీ మార్పులు వచ్చాయి.తాజాగా జర్మనీ ఆటోమొబైల్ కంపెనీ అయిన బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ రెడీ అయ్యింది.
ఈ వాహనాన్ని ఆ సంస్థ భారత్ కు తీసుకొస్తోంది. ఢిల్లీలో జరిగినటువంటి జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ04 ఎలక్ట్రిక్ వాహనాన్ని బీఎండబ్ల్యూ సంస్థ ఆవిష్కరించింది.
పోర్ట్ ఫోలియోలో ఈ ఎలక్ట్రిక్ స్కూటరే మొదటిది కావడం విశేషం.ఈ బైక్ ను 2023లో జనవరి నెలలో భారత మార్కెట్లలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ వాహనంలో 8.9 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఏర్పాటు చేశారు.ఇది 42 హార్స్ పవర్ లేదా 31 కిలోవాట్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని బీఎండబ్ల్యూ సంస్థ వెల్లడించింది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.6 సెకన్లలో 50 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది.ఈ వాహనాన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కిలో మీటర్ల వరకూ కూడా ప్రయాణం సాగించవచ్చు.
ఈ బైక్ గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంటుందని బీఎండబ్ల్యూ సంస్థ వెల్లడించింది.బ్యాటరీ పూర్తిగా అయిపోతే 2.3 కిలోవాట్ చార్జర్ తో 100 శాతం చార్జింగ్ కు 4 గంటల 20 నిమిషాల టైమ్ పడుతుందని, అదే 6.9 కిలోవాట్ చార్జర్ ఉపయోగిస్తే చార్జింగ్ టైమ్ గంటా 40 నిమిషాలకు తగ్గుతుందని బీఎండబ్ల్యూ సంస్థ తెలిపింది.
మొదట ఈ బైక్ ను సీఈ-04 ఎకో, రోడ్, రెయిన్ పేరుతో మూడు వేరియంట్లలో మార్కెట్లలోకి తీసుకొస్తున్నారు.ఈ మోడ్రన్ స్కూటర్ లో 10.25 అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ ను కూడా ఏర్పాటు చేశారని, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉందని బీఎండబ్ల్యూ సంస్థ వెల్లడించింది.