ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన భారతీయుల హవా అక్కడ కొనసాగుతూనే ఉంటుంది.భారతీయ నిపుణులకు ఇతర దేశాలు ఇచ్చే ప్రాధాన్యత మరే దేశస్తులకు ఇవ్వరని గర్వంగా చెప్పుకోవచ్చు మనం.
అగ్ర రాజ్యం అమెరికాలో నిపుణులైన వారికోసం ఇచ్చే వీసాలలో భారతీయులే అత్యధికంగా ఉంటారు.అక్కడి పలు కంపెనీలు సైతం మన వాళ్ళకు రెడ్ కార్పెట్ పరుస్తాయి.
ఇప్పటికీ అక్కడ ఇచ్చే వృత్తి నైపుణ్య వీసాలలో భారతీయులే అత్యధికం.
కాగా బ్రిటన్ లో కూడా మన భారతీయులు ఇదే స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేశారు.
అక్కడ నిపుణులకు ఇచ్చే వీసాలలో భారత్ కి చెందినా వారే అత్యధికంగా ఉన్నారని, గడిచిన ఏడాది సుమారు 65 వేల పైగా వీసాలను భారతీయులు దక్కించుకున్నారని, బ్రిటన్ హై కమిషన్ వెల్లడించింది.అమెరికాలో నెలకొన్న వీసా నిభందనల కారణంగా ఎంతో మంది భారతీయ నిపుణులు బ్రిటన్ వైపు చూస్తున్నారని ఈ ఫలితమే గడిచిన ఏడాది కంటే కూడా ఈ ఏడాది సుమారు 14 శాతం అధికంగా వీసాలు అందించడం జరిగిందని హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు.
బ్రిటన్ కంపెనీలో ఉద్యోగం పొంది , సదరు కంపెనీ ఈ వ్యక్తి తమ కంపెనీలో ఉద్యోగం పొందాడని సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ పేరుతో ఓ పత్రాన్ని జారీ చేస్తే బ్రిటన్ అందించే స్కిల్డ్ వర్క్ వీసాను పొందేందుకు అర్హులు అవుతారు.అంతేకాదు వీసా పొందేందుకు అభ్యర్ధన పెట్టె వ్యక్తి ఆ దేశం అనుమతించే ఉద్యోగాల లిస్టు లోని ఉద్యోగాన్ని మాత్రమే ఎంచుకోవాలి, ఆ ఉద్యోగాన్ని బట్టి కనీస వేతనాన్ని జీతంగా పొందాలి.
ఇదిలాఉంటే భారత్ నుంచీ బ్రిటన్ కు ఉన్నత చదువుల కోసం వెళ్ళే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.గతంలో అమెరికాకు పెద్ద ఎత్తున చదువుల కోసం వెళ్ళే విద్యార్ధులు ఇప్పుడు బ్రిటన్ బాట పడుతున్నట్టుగా తెలుస్తోంది.