కోవిడ్ రక్కసితో ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఒక్కొక్క నగరం ఈ మహమ్మారి పడగ నీడలోకి వెళ్లిపోవడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో లాక్డౌన్ విధించింది ఆసీస్ సర్కార్.
ప్రజల నుంచి నిరసన వ్యక్తమైనా సరే సైన్యాన్ని రంగంలోకి దించి మరి కఠినంగా వ్యవహరించింది.అలాగే అంతర్జాతీయ ప్రయాణీకులపైనా నిషేధం విధించింది.
ముఖ్యంగా భారత్ విషయంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చేసిన ఓవరాక్షన్ దుమారం రేపింది.
భారత్ నుంచి వచ్చేవారితో పాటు సొంత పౌరులపైనా ఆయన బ్యాన్ విధించారు.ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు నిబంధనలను అతిక్రమించి స్వదేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.49 లక్షల వరకు జరినామా విధిస్తామని మోరిసన్ హెచ్చరించారు.అయితే ప్రధాని నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.ఈ తర్వాత దీనిని ఎత్తివేశారనుకోండి.అది వేరే విషయం.తాజాగా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో పాటు ఆంక్షల కారణంగా ఇప్పుడిప్పుడే ఆస్ట్రేలియాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో స్కాట్ మోరిసిన్ సోమవారం కీలక ప్రకటన చేశారు.దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఫిబ్రవరి 21 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులను ఆస్ట్రేలియాలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అయితే వారంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని వుండాలని మోరిసన్ అన్నారు.అయితే రాష్ట్రాలు తమ సొంత క్వారంటైన్ నిబంధనలను మాత్రం అమలు చేస్తాయని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ టూరిస్టుల ద్వారా తన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.కోవిడ్ ఆంక్షలు, వరుస లాక్డౌన్ల కారణంగా హాస్పిటాలిటీ రంగం తీవ్రంగా దెబ్బతింది.
టూరిజం ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం.అక్కడి పర్యాటక రంగం కోవిడ్కు ముందు 84.9 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది.కరోనా వెలుగుచూసిన తొలి సంవత్సరంలో టూరిజం సెక్టార్ 41 శాతం మేర ఆదాయాన్ని కోల్పోయింది.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడిలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ టూరిస్టులకు ఆస్ట్రేలియా డోర్స్ ఓపెన్ చేసింది.