సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి గురించి తెలంగాణ రాజకీయాల్లో తెలియని వారుండరు.ఆయన చేసే రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతాయి.
జగ్గా రెడ్డి సొంత పార్టీ వారు అని కూడా చూడకుండా విమర్శలు చేస్తారనే ప్రచారం ఉంది.ఇటీవల జగ్గా రెడ్డి కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది.
ఆయన రేవంత్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారని టాక్.రేవంత్ రెడ్డి తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రోగ్రాములు చేస్తున్నారని ఆయన కోపానికి వచ్చారు.
రేవంత్ తన వైఖరిని మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు.సంక్రాంతి పండుగ తర్వాత హై కమాండ్ ను కలుస్తానని కూడా తెలిపారు.
కానీ సంక్రాంతి దాటిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ జగ్గా రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉండడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.అసలు ఏం జరిగిందంటే…
తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని ఆరోపిస్తూ టీ కాంగ్రెస్ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలోనే మొదట నిర్వహించాలని కూడా నిశ్చయించారు.కానీ సరిగ్గా ఆ కార్యక్రమానికి పోదామనుకునే సమయానికే పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు.
దీంతో ఈ కార్యక్రమం చేయకుండానే ముగిసిపోయింది.కానీ ఇదే విషయాన్ని జగ్గా రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు.
ఎర్రవల్లి తన నియోజకవర్గంలో ఉందని తన నియోజకవర్గంలో కార్యక్రమం చేద్దామని అనుకునే ముందు కనీసం తనకు సమాచారం ఇవ్వరా అని ఆయన గుర్రుగా ఉన్నారు.దీనిపై ఫిర్యాదు చేస్తూ అధిష్టానానికి లేఖ కూడా రాశారు.సంక్రాంతి పండుగ తర్వాత అధిష్టానాన్ని కలుస్తానని చెప్పారు.కానీ అధిష్టానం ఆయన్ను హెచ్చరించిందని, అన్నీ తమకు తెలుసని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.అధిష్టానం అలా చేయడం వలనే జగ్గా రెడ్డి సైలెంట్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.