ఏపీ రాజకీయాలు ఎల్లప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.ఎత్తులు పై ఎత్తులతో రణరంగాన్ని తలపిస్తాయి.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంది.ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.
ఆయన ప్రమాణ స్వీకార సమయంలో రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడున్న మంత్రులలో 90 శాతం మందిని మారుస్తానని హామీ ఇచ్చారు.కానీ ఇప్పుడు చూసుకుంటే ఇది అమలయ్యేలా కనిపించడం లేదని చాలా మంది చెబుతున్నారు.
మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ అనేక విషయాల్లో ఇప్పటికే మాట తప్పారు.శాసనమండలి రద్దు విషయాన్ని వెనక్కి తీసుకోవడం, మూడు రాజధానుల విషయంలో వెనుకడుగు వేయడం వంటి అనేక నిర్ణయాలను ఆయన ప్రభుత్వం తీసుకుంది.
ఇక మంత్రుల విషయంలో కూడా అందరినీ మార్చడం సంభవం కాదని అనేక మంది చెబుతున్నారు.
అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ వైసీపీ పరిపాలనా గ్రాఫ్ చాలా తగ్గిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.కాబట్టి ఈ సమయంలో మంత్రి వర్గాన్ని పూర్తిగా మార్చడం ఎంత మాత్రం సాధ్యం కాదని వారు చెబుతున్నారు.మహా అయితే మంత్రి వర్గంలో ముగ్గురినో లేక నలుగురినో భర్తీ చేసే అవకాశం ఉంది కానీ 90 శాతం మంది మంత్రులను తీయడం అంటే చాలా కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ కరోనా పరిస్థితుల్లో మంత్రులు బయట తిరిగేందుకు సరైన అవకాశమే రాలేదు కాబట్టి వారి పని తీరును అంచనా వేయడం సరి కాదంటున్నారు.అయినా చాలా మంది మంత్రులు సరిగ్గానే తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్నారని చెబుతున్నారు.
కావున అందరినీ తీయడంలో ఎటువంటి అర్థం లేదని పేర్కొంటున్నారు.అంటే ఈ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం మాట తప్పుతూ మడమ తిప్పనుందని అందరూ చర్చించుకుంటున్నారు.
మరి జగన్ రాబోయే కాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.