ఓటు హక్కు వినియోగంపై నవతరం అంతగా ఆసక్తి చూపడం లేదు.ప్రజలు ఓటు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పోలింగ్ రోజున సెలవు ప్రకటిస్తోంది.
కానీ నేటి యువత మాత్రం ఓటు హక్కు వినియోగించుకోకుండా.విహార యాత్రలకు, కుటుంబంతో, సన్నిహితులతో గడిపేందుకు సెలవును ఉపయోగించుకుంటోంది.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన ఆయుధం.కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం భారత రాజ్యాంగం కల్పిస్తుంది.
ప్రజారంజక పాలనను ఇచ్చే వారికి తమ ఓటు హక్కు ద్వారా మరింత ఊతమివ్వడం లేదంటే ప్రజా వ్యతిరేక పాలన సాగించేవారిని గద్దే దించే అవకాశం కూడా ఓటర్లకే ఉంది.మంచి పాలకులను, ప్రభుత్వాలను ఎంచుకునే హక్కు ప్రజల చేతుల్లోనే ఉంటుంది.
కేవలం ఓటు అనే వజ్రాయుధంతోనే ఇది సాధ్యం.ఇంతటి మహత్తర శక్తిని కలిగిఉన్న ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోంది.
పక్కనే వున్న పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి మనకు బద్ధకం.కానీ వేల కిలోమీటర్ల దూరంలో స్థిరపడినప్పటికీ ఓటు వేయాలనే బాధ్యతతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎన్ఆర్ఐలు.
తమిళనాడు, అస్సాం, బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలోని అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు.ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు.
తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల సత్యశీలన్ సింగపూర్లో ఇంజినీర్గా పని చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో స్వరాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించాడు.దీనిలో భాగంగా పోలింగ్కు ముందు రోజు కాకుండా.20రోజుల ముందుగానే స్వరాష్ట్రానికి చేరుకుని గత మంగళవారం ఓటు వేశాడు.తనకు తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఇష్టమని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
అలాగే తమ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం పని చేస్తున్న పార్టీకి ఓటు వేసినట్లు సత్యశీలన్ చెప్పాడు.కేరళకు చెందిన కే.ఎల్ గోపీ.గత కొన్నేళ్లుగా దుబాయిలోనే నివసిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం దుబాయ్ నుంచి తన స్వగ్రామానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మీ ‘‘ఓటు హక్కు ’’ చాలా విలువైనది.
దీనిని వినియోగించడం అత్యంత అవసరం, మిమ్మల్ని పాలించే, మీ గురించి ఆలోచించే సరైన వ్యక్తిని ఎంచుకుని చట్టసభలకు పంపే అవకాశం ఓటు హక్కు కల్పిస్తుంది.ఈ దేశ పౌరులుగా సరైన ప్రభుత్వాన్ని ఈ దేశానికి, రాష్ట్రానికి అందించడంలో తోడ్పాటును అందించండి.
సరైన అభ్యర్ధికి ఓటు వేస్తే.ఈ దేశం మీకు రుణపడి వుంటుంది.
గుర్తుపెట్టుకోండి.