సాధారణంగా మనం చేపలను వేర్వేరు వంటకాలు చేసుకుని తినేందుకు మాత్రమే ఉపయోగిస్తాం.అయితే చేప చనిపోయిందని బాధ పడటం గతంలో ఎప్పుడూ వినలేదు.
అయితే జాంబియాలో మాత్రం చేప మరణించడంతో ఒక క్యాంపస్ విద్యార్థులే బోరున ఏడ్చారు. చనిపోయిన చేప చుట్టూ నిలబడి సంతాపం వ్యక్తం చేశారు.
జాంబియా దేశ అధ్యక్షుడు సైతం చచ్చిన చేపకు సంతాపం ప్రకటించాడు.
వినడానికి కొంత ఆశ్చర్యంగానే అనిపించినా చేప చనిపోయిందనే కారణంతో చాలామంది విద్యార్థులు ఏడ్చారు.
క్యాంపస్ విద్యార్థులు చేపను ఇంతలా ఇష్టపడటానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.పూర్తి వివరాల్లోకి వెళితే జాంబియాలోని కాపర్బెల్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్న చెరువులో ఒక చేప ఉండేది.
ఆ చేపను “మాఫిషి” అనే పేరుతో పిలిచేవారు.ఈ చేపను ఆ యూనివర్సిటీ విద్యార్థులంతా అదృష్టం తెచ్చిపెట్టే చేపగా భావించేవారు.
దాదాపు 20 సంవత్సరాల నుంచి చెరువులో ఉన్న ఆ చేప మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా చదువుకునేలా చేసేదని, పరీక్షల్లో తాము పాస్ అయ్యేలా చేసేదని తమకు విశ్వాసం ఉండేదని చెబుతున్నారు.చేప చనిపోవడంతో తమను దురదృష్టం వెంటాడే అవకాశం ఉందని పలువురు విద్యార్థులు భావిస్తుండటం గమనార్హం.
యూనివర్సిటీ నిర్వాహకులు మాట్లాడుతూ మాఫిషీ అనే బిగ్ ఫిష్ వయస్సు దాదాపు 22 సంవత్సరాలని తెలిపారు.
బిగ్ ఫిష్ అనే మాఫిషి గత 20 సంవత్సరాలుగా యూనివర్సిటి చెరువులో ఉందని… ఈ బిగ్ ఫిష్ అంటే తమకు ఎంతో ఇష్టమని తెలిపారు.
లారెన్స్ కసోండే అనే విద్యార్థి నాయకుడు మీడియాతో మాట్లాడుతూ తాను కాలేజీలో చేరిన రోజు నుంచి ఆ చేపతో తనకు అనుబంధం ఉందని… ఎప్పుడైనా తాను ఒత్తిడిగా ఉందని భావిస్తే చెరువుగట్టు దగ్గరకు వెళితే ఒత్తిడి తగ్గిపోయేదని చెప్పాడు.ఈ చేప ప్రాముఖ్యత తెలిసి జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ సంతాపం ప్రకటించగా… విద్యార్థులు చేప కుళ్లిపోకుండా దానికి ఎంబామింగ్ చేయనున్నారని తెలుస్తోంది.