ప్రముఖ దేశీయ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఇప్పటికే డెలివరీ విషయంలో చాలా పొరపాటు చేసి కస్టమర్ల ఆగ్రహానికి గురి అయ్యింది.అయినా కూడా ఈ కంపెనీ తన తీరును చక్కదిద్దుకోలేకపోతోంది.
తాజాగా ఈ సంస్థ మరోసారి పంపించాల్సిన ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్స్ పంపి అందరిచేత తిట్లు తింటుంది.వివరాల్లోకి వెళితే.ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలోని కాసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ అనే యువతి ఫ్లిప్కార్ట్ నుంచి రిస్ట్ వాచ్ ఆర్డర్ పెట్టింది.“బిగ్ బిలియన్ డేస్” సందర్భంగా సెప్టెంబర్ 28న దీనిని ఆర్డర్ చేసింది.డెలివరీ బాయ్ ఈ వాచ్ను ఎట్టకేలకు ఆ యువతికి డెలివరీ చేశాడు.
ఈ వాచ్ వాల్యూ రూ.1,304 కాగా దానిని క్యాష్ ఆన్ డెలివరీగా ఎంచుకున్నారు.ఇది తొమ్మిది రోజుల తర్వాత అక్టోబర్ 7న వచ్చింది.
దానిని తెరిచి చూడగా ఆ ప్యాక్లో వాచ్కి బదులుగా 4 చిన్న ఆవు పిడకలు కనిపించాయి.దాంతో ఆ యువతి ఒక్కసారిగా స్టన్ అయింది.
ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి సోదరుడు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు.వెంటనే అతడు పిడకలను వదిలించుకొని తన డబ్బులు తాను తెచ్చుకోవాలనుకున్నాడు.
అందుకోసం డెలివరీ బాయ్కి కాల్ చేసి చైల్ టౌన్కి వెళ్లి కలుసుకున్నాడు.
అప్పుడు అతను డబ్బును తిరిగి ఇవ్వడానికి అంగీకరించాడు.పొరపాటున డెలివరీ చేసిన ఆవు పిడకలను కస్టమర్ నుంచి సేకరించాడు.అయితే దీని గురించి సోషల్ మీడియాలో తెలియజేయగా ఫ్లిప్కార్ట్ ని నెటిజన్స్ బాగా తిట్టిపోస్తున్నారు.
కస్టమర్లను ఇలా మోసం చేయడం వల్ల మీ వ్యాపార నైతికత దెబ్బ తింటుంది, కొన్ని రోజుల్లో మీ ఫేక్ కార్ట్ మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.