కొన్నేళ్ళ క్రితం ఒక ఆసుపత్రి వైద్యులు చేసిన తప్పిదం తాజాగా బయటపడింది.వీరి కారణంగా ఒక మహిళ నరక యాతన అనుభవించింది.
వివరాల్లోకి వెళితే, 30 ఏళ్ల హర్షినా ఐదేళ్ల క్రితం అంటే 2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీలో సిజేరియన్ చేయించుకుంది.అయితే డాక్టర్లు సిజేరియన్ తర్వాత ఆమె కడుపులోనే కత్తెర వదిలేసి మర్చిపోయారు.
అప్పటి నుంచి ఆమె కత్తెరతోనే బతుకుతోంది.కాగా ఇటీవల విపరీతమైన నొప్పిని అనుభవించింది.
ముఖ్యంగా గత ఆరు నెలలుగా భరించలేని నొప్పి ఆమెకు నరకం చూపించింది.చివరికి స్కానింగ్ చేయించుకోగా తన కడుపులో మెటల్ వస్తువు ఉన్నట్లు తేలింది.
దీంతో కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు సెప్టెంబర్ 17న ఆమెకు ఆపరేషన్ చేశారు.ఈ ఆపరేషన్లో ఐదేళ్లుగా ఆమె కడుపులో ఉన్న ఫోర్సెప్స్ అని పిలిచే కత్తెరను తొలగించారు.
ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్సల సమయంలో రక్తస్రావ నాళాలను బిగించడానికి సర్జన్లు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం.సిజేరియన్ సర్జరీ వల్లే ఈ నొప్పి తనని బాధించిందని ఆమె మొదట్లో అనుకుంది కానీ ఎప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో చివరికి వైద్యులను ఆశ్రయించింది.
ఈ లోహపు వస్తువు తన మూత్రాశయాన్ని గుచ్చుకుందని, దీనివల్ల ఇన్ఫెక్షన్ కలిగిందని, ఫలితంగా నొప్పి భరించలేనిదిగా మారిందని ఆమె చెప్పుకొచ్చింది.
అనంతరం తనకు సిజేరియన్ చేసిన డాక్టర్ ల పై ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదుపై చర్య తీసుకున్న కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.త్వరలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా విచారణకు ఆదేశించింది.