మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ చోట బంగారు గని బయటపడింది.ఓ ఇంటిని కూల్చివేస్తుండగా కూలీల చేతికి అది చిక్కింది.
బంగారు నాణేలు కావడం వలన సహజంగానే కూలీలకు దురాశ పుట్టింది.దాంతో వారంతా ఓ ఒప్పందం ప్రకారం ఆ బంగారు నాణేలను పంచుకున్నారు.
కానీ కట్ చేస్తే ఆ యవ్వారం కాస్త పోలీసులకు చిక్కడంతో వారి ఆనందం నీరుగారింది.వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్లో శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటిని ఇటీవల 8 మంది కూలీలు కూల్చివేశారు.
తరువాత ఆ శిథిలాలను తొలగిస్తున్న సమయంలో ఓ లోహపు పాత్ర కనిపించింది.దానిని తీసుకుని చూడగా అందులో 84 పురాతన బంగారు నాణేలు, ఆభరణాలు కనిపించాయి.
ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పకుండా ఆ ఎనిమిది మంది కూలీలు గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారు.ఈ క్రమంలో ఓ కూలీ తనకు వచ్చిన వాటాలోని ఓ బంగారు నాణెంను విక్రయించి కొన్ని సరకులతో పాటు ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొన్నాడు.
మిగిలిన సొమ్ముతో బాగా మద్యం సేవించాడు.ఆ మత్తులో ఈ బంగారు నాణేల గని వ్యవహారాన్ని కాస్త బయటపెట్టేశాడు.ఇది ఆ నోటా, ఈ నోటా చేరి చివరకు పోలీసులకు, పురావస్తు శాఖ అధికారులకు చేరింది.దీంతో వారు రంగంలోకి దిగి కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కూలీలకు దొరికిన లోహపు పాత్రలోని ఆభరణాలు, నాణేల విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేయగా పురావస్తు శాఖ మాత్రం ఆ సొత్తు విలువ రూ.1.25 కోట్ల వరకు ఉంటుందని చెప్పడం గమనార్హం.ఆ తరువాత వారు ఆ బంగారు నాణేలను వారినుండి తీసుకోవడం జరిగింది.ఇక ఈ తంతు విన్న స్థానికులు… “కూలీల బతుకులు మారే అవకాశం వచ్చినా, వారికి రాసిపెట్టిలేదు!” అని మూతులు గోరుక్కుంటున్నారు.