తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో వచ్చే మంగళ వారాలు ఎంతో పవిత్రమైనవి.ఈ నాలుగు మంగళవారాలలో మహిళలు పెద్ద ఎత్తున మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు.
మంగళ గౌరీ అంటే సాక్షాత్తు పార్వతీ దేవి.అందుకోసమే శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీవ్రతం ఆచరించడం వల్ల మహిళలు దీర్ఘ సుమంగళిగా వుంటారని భావిస్తారు.
మరి మంగళ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? మంగళగౌరీ వ్రతం విశిష్టత ఏమిటి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు.
ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన వారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి మాంగల్యబలం గట్టిగా ఉంటుందని భావిస్తారు.కొత్తగా పెళ్లి అయిన వారు వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని పెళ్లి అయిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి.
ఈ క్రమంలోనే తొలి ఏడాది మంగళగౌరీ వ్రతాన్ని పుట్టింటిలో చేయగా మిగిలిన నాలుగు సంవత్సరాలు అత్తారింట్లో ఈ వ్రతం నిర్వహించాలి.

ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి పక్కనే వారి తల్లి కూర్చుని తమ కూతురి చేత పూజ చేయించాలి.పూజ అనంతరం తొలి వాయనం తల్లికే ఇవ్వాలి.ఒకవేళ తల్లి లేని పక్షంలో అత్తకు వాయనం ఇవ్వాలి.
ఈ వ్రతం చేసే మహిళలు తప్పకుండా కాళ్ళకు పారాణి పెట్టుకుని వ్రతం చేయాలి.ఈ వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించాలి.
వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి.ఈ విధంగా అమ్మవారికి వ్రతం చేసేటప్పుడు నెల మొత్తం ఒకటే విగ్రహం ఉపయోగించి వినాయక చవితి తరువాత వినాయక నిమజ్జనం రోజు అమ్మవారి విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేయాలి.
మంగళగౌరీ వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా గరిక, ఉత్తరేణి, తంగేడుపూలు ఉండాలి.ఈ విధంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, పండ్లను కలిపి వాయనం ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం కలుగుతుందని చెప్పవచ్చు.