కరువు కాటకాలు అనేవి అనాదినుండే వస్తున్నాయి.అయితే మానవుడు అభివృద్ధి చెందుతూ మానవ అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త వంగడాలను కనిపెట్టి విశ్వమానవాళికి ఆహార కొరత లేకుండా చేసాడు.
అయినప్పటికీ నేటికీ కొన్ని కొన్ని ప్రాంతాలలోని ప్రజలు జీవితాలు కరువు కాటకాలతో మగ్గిపోతున్నాయి.ఈ క్రమంలో అనేక దేశాల్లో ప్రస్తుతం కరువు తాండవిస్తోంది.
చైనా, భారత్ లాంటి పెద్ద దేశాలు సైతం కరువు దెబ్బకు అల్లాడిపోతున్న సంగతి విదితమే.తాజాగా జింబాబ్వేలో కరువు పరిస్థితి మరింత దారుణంగా మారింది.
ఓ వైపు దేశంలోని కరువు, ఒక్కసారిగా మారిన వాతావరణం వల్ల దేశంలోని ప్రజలకే కాదు.మృగాలకు కూడా తీవ్ర మైన నష్టం వాటిల్లుతోంది.దీంతో కరువు ప్రాంతంలో ఉన్న క్రూర మృగాలను రక్షించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా కరువు ప్రదేశంలోని క్రూర మృగాలను వేరే ప్రదేశానికి తరలించేందుకు అన్ని సౌకర్యాలను చేపడుతోంది.
ఈ క్రమంలోనే కరువు ప్రాంతంలో ఉన్న దాదాపు 2,500 జంతువులను దక్షిణ రిజర్వ్ నుండి ఉత్తర రిజర్వ్కు తరలింపు ప్రారంభించారు.
వీరిలో 2000 ఇంపాలాలు, 400 ఏనుగులు, 70 జిరాఫీలు, 50 వన్యప్రాణులు, 50 జీబ్రాలు, 10 సింహాలు, 50 ఎలాండ్లు ఇంకా మరెన్నో వన్యమృగ ప్రాణులు వున్నాయి.
వీటిని పెద్ద పెద్ద ట్రక్కుల సహాయంతో తరలిస్తున్నారు.ఈ జంతువులన్నీ కూడా జాంబేజి నది లోయలోని సంరక్షణ కేంద్రాలకు పంపనున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.అలాగే అక్కడ స్థానికంగా వున్న ప్రజలకు ఆహారధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు.