గత కొద్ది రోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీ( YCP ) పై విపక్షాలు విమర్శలతో విడుచుకుపడుతున్నాయి.వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన , వాలంటరీ వ్యవస్థ పైనా సంచలన ఆరోపణలు చేయడంతో పాటు, అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
ఒకవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh ) యువ గళం పాదయాత్ర లో పూర్తిగా వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూనే లోకేష్ పర్యటించే నియోజకవర్గం లోని కీలకమైన వైసీపీ నేతల పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు అదే విధంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేపట్టారు.ఈ యాత్రలో అనేక సంచలన విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారు.
వాలంటరీ వ్యవస్థపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తే విధంగా పవన్ అనేక ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి, దానిని దుర్వినియోగం వైసీపీ ప్రభుత్వం చేస్తుందనే విమర్శలు చేశారు .వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా వైసిపి ప్లాన్ చేసుకుంటూ ఉండడంతో, దానిని దెబ్బతీయడమే లక్ష్యంగా పవన్ ముందుకు వెళ్తున్నారు.విపక్షాలు ఈ స్థాయిలో ఏపీ ప్రభుత్వం పైన , వైసిపి పైన విమర్శలు చేస్తున్నా, ఆ పార్టీ నాయకులు పెద్దగా స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం ముగ్గురు, నలుగురు నేతలు మాత్రమే స్పందిస్తూ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇక వైసిపి సోషల్ మీడియా విపక్షల ఆరోపణలను తిప్పికొడుతున్నా, పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు, పదవులు, ప్రాధాన్యం లేక అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలు , ఇలా ఎవరికి వారు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ ఉండడం, తమ పార్టీపై విమర్శలు చేసినా సైలెంట్ గా ఉండడం, మరి కొంతమందికి మంత్రి పదవులు రాలేదనే అసంతృప్తి ఉండగా , మరి కొంతమంది ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయోజనాలు పొందకపోవడం, వచ్చే ఎన్నికల్లో సీటు హామీ దక్కకపోవడం, ఇలా రకరకాల కారణాలతో అసంతృప్తితో ఉన్నారు.
వారంతా వైసిపి ప్రభుత్వంపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, సైలెంట్ గానే ఉంటున్నారు .జగన్ తో సన్నిహితంగా మెలిగిన నేతలు సైతం సైలెంట్ కావడం పార్టీలో చర్చగా మారింది.గత నాలుగేళ్లుగా జగన్( CM jagan ) తమను సరిగా పట్టించుకోలేదని, కీలకమైన పదవులు కట్టబెట్టలేదని చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు.ఆ అసంతృప్తితోనే విపక్షాల విమర్శలను తిప్పుకొట్టే విషయంలో పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తుండడం వంటివి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.