గత కొంతకాలంగా టిడిపితో అంటి మూడున్నట్టుగా వ్యవహరిస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఈ మధ్యకాలంలో వైరల్ గా మారింది.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా, టిడిపి ఎంపీలు ఆయనకు కేసినేని నాని ద్వారా బొకే అందించే ప్రయత్నం చేయగా, నాని ఆ బొకేను చంద్రబాబుకి ఇవ్వడం ఇష్టం లేక నెట్టిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి నాని సోషల్ మీడియా ఎకౌంటు పేరుతో వచ్చిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి.చంద్రబాబును హేళన చేస్తున్నట్లుగా పెట్టిన ఆ ట్విట్స్ పై టీడీపీ శ్రేణులు బగ్గుమనగా, వైసిపి సోషల్ మీడియా విభాగం దానిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడుకోవడాన్ని ఆధారంగా చేసుకుని ఈ ట్వీట్స్ పోస్ట్ కావడం, ఇది రచ్చగా మారడంతో దీనిపై కేశినేని స్పందించారు.అసలు తన అధికారిక ట్విట్టర్ నుంచి ఎటువంటి పోస్టులు పెట్టలేదని, ఇవన్నీ ఫేక్ ట్వీట్స్ అని నాని తాజాగా స్పందించారు.ప్రధాని నరేంద్ర మోదీని తనను కొంచెం పట్టించుకోవాలని, రాజకీయంగా ఎప్పుడూ తోడుగా ఉంటానని చంద్రబాబు అభ్యర్థిస్తున్నట్లుగా ఆ ట్విట్స్ ఉండడం, అపాయింట్మెంట్ ఇస్తే తానే స్వయంగా వచ్చి కలుస్తానని చంద్రబాబు ప్రాధేయపడుతున్నట్లుగా వాటిని కేసినేని నాని ట్విట్ చేసినట్లుగా నకిలీ ట్వీట్స్ వైరల్ కావడంతో నాని ఘాటుగానే స్పందించారు.తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి వెలువడిన పోస్టులను ఫ్యాబ్రికేట్ చేశారని నాని ఆరోపిస్తున్నారు.
వాటిని ఎవరు నమ్మవద్దని, దీనిపై సైబర్ సెల్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కేశినేని నాని చెప్పారు.ఇప్పటివరకు నాని ట్వీట్స్ తో ఇబ్బందులుపడుతున్న టీడీపీ అవన్నీ ఫేక్ అని తేలడంతో వైసీపీ నేతలే ఈ ఫేక్ ట్విట్స్ వైరల్ చేస్తున్నారని మండిపడుతోంది.