కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.వీరి నిరసనలు మొదలై నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా నేడు భారత్ బంద్ ప్రకటించారు.
ఇందులో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీకి దారితీసే అన్ని రహదారులనూ రైతులు దిగ్బంధించగా, ప్రజలకు నిత్యావసరాలైన పాలు, కూరగాయలు సరఫరా చేసే వాహనాలు సైతం నిలిచిపోయాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ బంద్ ప్రభావంతో ఢిల్లీలోని దాదాపు అన్ని మార్కెట్లూ మూతపడ్డాయి.అదీగాక నాలుగు రైళ్లు పూర్తిగా రద్దు కాగా, దాదాపుగా 30కి పైగా రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయని సమాచారం.
అంతే కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లను ఢిల్లీ, చండీగఢ్, ఫిరోజ్ పూర్, అమృతసర్ తదితర స్టేషన్లలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇకపోతే దేశ రాజధాని చుట్టు పక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో భారత్ బంద్ ప్రభావం అధికంగా ఉంది.
ఇక ఈరోజు ఉదయం 5 గంటలకు మొదలైన నిరసనలు సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగిస్తామని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించినట్టు వార్త బయటకు వచ్చింది.