ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు-ఉప ముఖ్యమంత్రి కేయీ కృష్ణమూర్తికి పడటంలేదా? వీరి మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి.అయితే అవి బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్తపడుతున్నారు.
అయితే ఈ విభేదాలు మరోసారి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.ఇందుకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చూపిస్తున్నారు విశ్లేషకులు.
బాబు వ్యాఖ్యలను కేయీ కృష్ణమూర్తి తేలిగ్గా తీసిపారేశారు.అసలేం జరిగింది? చంద్రబాబు విజయవాడలో అన్ని జిల్లాల కలెక్టర్లతో, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి పనితీరును సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన రెవిన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.ఈ శాఖలను ఉప ముఖ్యమంత్రి చూస్తున్నారు.బాబు వ్యాఖ్యలపై కృష్ణమూర్తి నొచ్చుకున్నారు.బాబు వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేశారు.
రెవన్యూ శాఖలో అనేక మార్పులు చేశామన్నారు.కుటుంబాలకు అవసరమైన ధ్రువపత్రాలను పదిహేను రోజుల్లో జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామన్నారు.ప్రధానమైన విషయమేమిటంటే….
కేయీ ఉప ముఖ్యమంత్రి అయినా బాబు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంలేదు.ఎందుకంటే రాజధాని నిర్మాణానికి భూ సేకరణను అంటే బలవంతంగా భూములు తీసుకోవడాన్ని కేయీ కృష్ణమూర్తి వ్యతిరేకించారు.
దీంతో రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కేపిటల్ రీజినల్ డెవెలప్మెంట్ అథారిటీ (క్రిడా) లో కేయీకి భాగస్వామ్యం కల్పించలేదు.రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఏ కమిటీలోనూ కేయీ సభ్యుడిగా లేరు.
కర్నూలు జిల్లాకు చెందిన కేయీ కృష్ణమూర్తి అక్కడ బలమైన నాయకుడు.రాష్ర్ట విభజన జరిగిన తరువాత రాజధానిగా కర్నూలును ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
ఆ కోరిక నెరవేరలేదు.బాబుకు, ఈయనకు మధ్య ఎప్పటి నుంచో అభిప్రాయభేదాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఆ కారణంగానే ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి శాంతిపచేశారు.రెవిన్యూలో అవినీతి ఎక్కువగా ఉందని చెప్పడం ద్వారా బాబు తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి అంతో ఇంతో ఉంటుంది.రెవిన్యూలో ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది.
కేయీ బదులు మరొకరున్నా పరిస్థితి మారదు.