తెలంగాణలో దేవాలయ భూములకు రక్షణ లేదని పదే పదే రుజువవుతోంది.దేవుడి మాన్యం ఆక్రమణలు నిరంతరం బయటపడుతూనే ఉన్నాయి.
దేవుడి కోసం ఇచ్చిన భూముల్ని ఆక్రమించికుని అమ్ముకోవడం ఫ్యాషన్ గా మారింది.ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ కబ్జాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీ నేతలే ఈ దురాగతాలకు ఒడిగడుతున్నారు.వారి అండతో ఆలయాల్లో పనిచేసేవారే దేవుడి మాన్యాన్ని మింగుతున్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ లోని వెండికొండ సిద్ధేశ్వర ఆలయానికి 4 వందల ఏళ్ళ చరిత్ర ఉంది.కాశీ నుంచి వచ్చిన సిద్ధుడు అనే మునీశ్వరుడు ఈ కొండ మీద తపస్సు చేశారని, అప్పుడు గోల్కొండ రాజ్యంలో కరువు కాటకాలు, అంటు వ్యాధుల గురించి సిద్ధుడికి తెలిసింది.
తాను తపస్సు చేస్తున్న వెండి కొండ మీద శివ లింగాన్ని ప్రతిష్టించమని స్థానిక ప్రజలకు ఆయన సూచించారు.శివ లింగం మీద గోపురం నిర్మించవద్దని కూడా సూచించారు.
ఆయన చెప్పిన విధంగా ఇప్పటికీ సిద్ధులగుట్ట మీది శివాలయంలో గోపురం ఉండదు.విశాలంగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే విధంగా ఆలయాన్ని నిర్మించారు.
ఆలయం నిర్మించినప్పటి నుంచి పరమేశ్వరుడు నిత్యం పూజలందుకుంటున్నాడు.స్థానిక ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు శివుడ్ని సేవించుకుంటున్నారు.

వందల సంవత్సరాలుగా భక్తులిచ్చే కానుకలతో ఆలయాన్ని నిర్వహిస్తున్నారు.50 ఏళ్ళ క్రితం స్థానిక ప్రజలు కొందరు నాలుగు సర్వే నెంబర్లలో మొత్తం 8 ఎకరాల 31 గుంటల భూమిని ఆలయానికి ఇచ్చారు.దేవుడికి నిత్యం ధూప దీప నైవేద్యాల కోసం ఈ భూమి మీద వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని కోరారు.ఆలయానికి భూములు ఇచ్చాక శంషాబాద్ గ్రామస్థులు గుడికి మాడపాటి నాగప్ప అనే పూజారిని నియమించారు.
నాగప్ప మరణం తర్వాత ఆయన తనయుడు జగదీశ్వరప్ప గుడి పూజారి బాధ్యతలు తీసుకున్నాడు.అయితే శంషాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందన్న ప్రచారంతోనే ఆ పరిసరాల్లో భూముల ధరలు ఆకాశానికి ఎగబాకాయి.
ఎక్కడెక్కడినుంచో వచ్చిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రైతుల నుంచి భూములు కొని అమ్మేసి కోట్లు సంపాదించుకున్నారు.దీంతో పూజారి జగదీశ్వరప్ప కళ్ళు గుడి భూములపై పడ్డాయి.తాను కూడా దేవుడి మాన్యాన్ని దొంగిలించడానికి పూనుకున్నాడు.