తెలుగు మాసాలలో వచ్చే మాఘమాసానికి హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ నెలంతా హిందువులు భక్తిశ్రద్ధలతో ఆ విష్ణుమూర్తిని వేడుకుంటారు.
అదేవిధంగా ఇంతటి పవిత్రమైన నెలలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు.హిందూమతంలో ఈ మాఘ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
అయితే మాఘ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు ఉదయం పవిత్రమైన నదులలో స్నానం చేసి, దానధర్మాలు చేస్తూ ఆ విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భక్తులు భావిస్తారు.అయితే మాఘ పౌర్ణమి ఎప్పుడు? పౌర్ణమి రోజు ఏ విధంగా స్వామివారిని పూజించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హిందువులు పౌర్ణమి వచ్చే తిథిని ఎంతో పవిత్రంగా భావిస్తారు.పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి రోజుల్లో వస్తుంది.అదేవిధంగా మరుసటి రోజు నుంచి కొత్త నెల ప్రారంభం అవుతుంది.అయితే ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి 2021 ఫిబ్రవరి 27 వచ్చింది.
ఈ మాఘ పౌర్ణమి రోజు భక్తులు ఉదయం ఎంతో పవిత్రమైన గంగానది వంటి నదులలో లేదా నీరు పారుతున్న కాలువల వద్ద వేకువజామునే స్నానాలు చేస్తే ఎంతో పుణ్యఫలం.అయితే పౌర్ణమి ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం3:49 నుంచి ప్రారంభం అయ్యి శనివారం మధ్యాహ్నం1:46 నిమిషాలకు ముగుస్తుంది.కాబట్టి 27వ తేదీ ఉదయం పౌర్ణమి ఉంటుంది కనుక 27వ తేదీ నదీ స్నానాలు ఆచరించడం ఎంతో ఉత్తమం.
మాఘ పౌర్ణమి రోజు పవిత్ర గంగానదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని చెబుతారు.
ఈ పౌర్ణమి రోజు కాశి, హరిద్వార్, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానాలు ఆచరించడం ఎంతో పుణ్య ఫలాన్నిస్తుందని పురాణాలు చెబుతాయి.ఎంతో పవిత్రమైన ఈ మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేయడం వల్ల విష్ణు మూర్తి వారికి అదృష్టం, సకల సంపదలను కల్పిస్తారని ప్రతీతి.
అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు భక్తులు ఉపవాస దీక్షలను చేస్తూ ఆ విష్ణు భగవానుడిని పూజిస్తారు.అలాగే పౌర్ణమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరిస్తారు.