కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బిజెపి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులను చేర్చుకుని బలపడాలని చూస్తోంది.
అలాగే బలమైన నాయకులను గుర్తించి వారిని ఉపయోగించుకుని బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో ఏపీ, తెలంగాణపై గతం కంటే ఎక్కువగా దృష్టి సారించింది.
సోము వీర్రాజుకు బీజేపీ పగ్గాలు అప్పగించి ప్రధాన ప్రతిపక్షం టిడిపి టార్గెట్ గా చేసుకుని ఏపీలో ముందుకు వెళుతోంది. తెలంగాణలోని ఎంపీ బండి సంజయ్ కు పార్టీ అధ్యక్షా పదవి కట్టబెట్టి పరుగులు పెట్టిస్తోంది.
ఈ క్రమంలో బండి సంజయ్ పార్టీని బలోపేతం చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ చేస్తున్నారు.పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తించే విధంగా ప్రయత్నిస్తున్నారు.
ఎలాగూ తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడింది కాబట్టి, పైచేయి సాధించాలని టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించాలని బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు.మొదట్లో కాస్త ఉత్సాహంగానే పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న, ఆ తర్వాత కాస్త ఆ హడావుడి తగ్గినట్టు కనిపిస్తోంది.
ముఖ్యంగా బిజెపి తెలంగాణలో పట్టు పెంచుకోకుండా కెసిఆర్ కొత్త ఎత్తుగడ వేశారు.బిజెపి విమర్శలను పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ, వారికి సమాధానం ఇస్తూ, కొత్త రాజకీయానికి తెర తీశారు.
కొద్దిరోజులుగా చూసుకుంటే కాంగ్రెస్ దూకుడు తెలంగాణలో ఎక్కువ అయింది.బిజెపి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడడం లేదు.
కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగానే నిత్యం హడావుడి నడుస్తోంది.బీజేపీ మాత్రం కేవలం ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉండగా కాంగ్రెస్ నాయకులు మాత్రం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి వ్యవహారాలు బయటకి తీస్తుండగా, బట్టి విక్రమార్క వంటివారు ఆసుపత్రి సందర్శన పేరుతో అన్ని ప్రాంతాలకు తిరుగుతూ, కరోనా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ బిజెపి లో ఆ ప్రయత్నాలు కనిపించడం లేదు.
కేవలం విమర్శల వరకే పరిమితం అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో, టిఆర్ఎస్, కాంగ్రెస్ ను దాటుకుని బిజెపి అక్కడ పాగా వేయగలదా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.