ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం అన్ని రాజకీయ పార్టీలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ విషయంలో అధికార పార్టీ విమర్శలు, ప్రశంసలు అందుకుంటోంది.
ఈ వ్యవహారంలో తమ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లి తాము ఎప్పుడూ ప్రజలవైపే నిలబడతామని చెప్పేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ప్రయత్నిస్తోంది.ఇక జనసేన విషయానికి వస్తే మొదట్లో అమరావతి ప్రాంతంలో హడావుడి చేసిన ఆ పార్టీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది.
కేవలం అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా పవన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే పరిమితం అయిపోయారు.అయితే ఈ విషయంలో బీజేపీ మాత్రం దాగుడు మూతలు ఆడుతూ వస్తోంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదు అంటూ ప్రకటన చేశారు.
ఇక ఆ పార్టీ మరో సీనియర్ నాయకులు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు మాత్రం ఆ వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమని, ఇందులో కేంద్రం జోక్యం ఉండదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
ప్రస్తుతం మూడు రాజధానుల అంశంలో వైసిపి దూకుడుగా ముందుకు వెళుతోంది.మూడు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరుస్తూ రాజకీయంగా పట్టు సాధించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ అనుకూలత కనిపించడం లేదు.
ప్రాంతాల వారిగా ఆ పార్టీల నాయకులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు కూడా ఇదే రకంగా ఉన్నారు.ఈ వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ ఉందా అంటే అదీ డౌట్ గానే ఉంది.
అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్, సామాజిక వర్గం అంశాలను వైసిపి బాగా హైలెట్ చేసి టిడిపికి మైలేజ్ రాకుండా చేయగలిగింది.ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే ఈ ఆరోపణలు టీడీపీకి బాగా ఇబ్బందిగా మారింది.ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో టిడిపి నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు ధైర్యంగా మద్దతు పలకలేకపోతున్నారు.
ఈ రెండు పార్టీల పరిస్థితి ఈ విధంగా ఉండటంతో ఖచ్చితంగా ప్రజల్లో ఈ రెండు పార్టీల పట్ల వ్యతిరేక భావం వస్తుందని, మూడు రాజధానులు నిర్ణయంతో అటు వైసిపి, టిడిపి బలహీనపడితే ఏపీలో బలమైన పార్టీగా తాము అవతరించవచ్చని బిజెపి భావిస్తోంది.
అందుకే మిగతా పార్టీల్లో ఉన్న సీనియర్ నాయకులను కమలం గూటికి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.వైఎస్సార్ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న మోహన్ బాబును బీజేపీలోకి తీసుకు వచ్చే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.దీనికి జనసేన పార్టీ మద్దతు తీసుకోవాలనే ఆలోచనలో ఆ పార్టీ అగ్ర నాయకులు ఉన్నారు.
మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో బిజెపి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే రాజధాని వ్యవహారంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండా సరైన అవకాశం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది.