ఏపీకి మూడు రాజధానులు ఉంటాయన్న జగన్ ప్రకటన తర్వాత ఎంతో మంది ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకించిన వాళ్లే తప్ప ఇది బాగుందని అన్న వాళ్లు చాలా తక్కువ.
చివరికి వైసీపీ నేతల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉండటం చూశాం.తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదనపై తనదైన రీతిలో స్పందించారు.
మూడు రాజధానుల పేరుతో జగన్ సామాజికవర్గానికి చెందిన వాళ్లు లాభపడటం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన తేల్చేశారు.మూడు ప్రాంతాల్లో అభివృద్ధి ప్రచారం చేస్తారు.దీనివల్ల భూముల ధరలు పెరుగుతాయి.ఇది చివరికి వాళ్ల సొంత సామాజికవర్గానికి మేలు చేస్తుంది అని వీహెచ్ చెప్పడం గమనార్హం.
అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్న విషయం గుర్తుంచుకోవాలని జగన్కు సలహా ఇచ్చారు.
మూడు రాజధానుల విషయంలో కేంద్రం రంగంలోకి దిగితే జగన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.ఒక్క రాజధానికే డబ్బులు లేనప్పుడు మూడు రాజధానులకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు.ఇలా మూడు రాజధానులు అంటే బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వకూడదని కేంద్ర ఆదేశించాలని వీహెచ్ సూచించారు.
ఏపీలో జగన్కు ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారని, దానిని దుర్వినియోగం చేయకూడదని ఆయన చెప్పడం విశేషం.ముందు పాదయాత్రలో మీరు జనానికి ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి అని జగన్కు వీహెచ్ స్పష్టం చేశారు.
అయితే ఎవరెన్ని చెప్పినా జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు.ఆయన చెప్పినట్లే జీఎన్ రావు కమిటీ కూడా మూడు రాజధానులు, నాలుగు ప్రాంతీయ కమిషనరేట్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
మరి అమరావతిని ఇప్పటికే ఏపీకి రాజధానిగా గుర్తించిన కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.