ఊరు మొత్తానికి స్వైన్ ఫ్లూ వచ్చింది అంటూ… చుట్టుపక్కల గ్రామాల వారు ఒక ఊరుని వేలెయ్యడం ఏపీలో సంచలనం సృష్టించింది.దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో పాటు ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో… ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు.
కృష్ణాజిల్లా చింతకోళ్ల గ్రామంలో సంభవించిన మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల జరిగినవి కావని తెలిపారు.అనారోగ్యం, కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని, స్వైన్ ఫ్లూపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.శానిటేషన్పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు.త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు.మందుస్తు నివారణకు ఆర్సీనిక్ అల్బెమ్ హోమియో మందు ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులను స్వైన్ ఫ్లూ నెపంతో ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.