గురువారం కేంద్రమంత్రివర్గం విస్తరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అంగీకరించడంతో రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఎంపిలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రాంతీయ, కుల సమతూకంతో తన మంత్రివర్గాన్ని రూపొందించడానికి మోడీ చేస్తున్న కసరత్తు తుదిరూపుకు వచ్చినట్లేనని ఈ క్రమంలోనే విస్తరణ ఉండనున్నదని సమాచారం.
రేపు జరగనున్న కొత్తమంత్రులు ఎవరన్నది స్పష్టతలేనప్పటికీ మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద్ సోనోవల్ ఇటీవల అసోం సిఎంగా ఎన్నికవ్వటంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడంతో పాటు మరికొన్ని శాఖల పని తీరు ఆశించిన విధంగా లేకపోవడంతో మంత్రివర్గంలో మార్పులు చేపట్టేందుకు మోడీ శ్రీకారం చుట్టారు.ప్రస్తుత మంత్రివర్గంలో ఉత్తరాఖండ్ కు స్ధానం లేకపోవటంతో ఆరాష్ట్రానికి స్ధానం దక్కనుంది.
కాగా .యూపీ నుంచి ఎంపీలు యోగి ఆదిత్యనాథ్, సత్యపాల్సింగ్, సాధ్వీ సావిత్రిభాయి పూలే పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటంతో పాటు అసోం నుంచి నవజ్యోతిసింగ్ సిద్ధూ, రామేశ్వర్ తేలి లకు చాన్సు దక్కే ఆస్కారం ఉంది.
అయితే కొత్తగా ప్రమాణం చేయనున్న మంత్రుల శాఖల కేటాయింపుపైనా భారీ కసరత్తు జరుగుతుండటంతో ఈ సారి ఈ మార్పు పెద్దగనే ఉంటుందని సమాచారం.కాగా మిత్ర పక్షమైన తెలుగుదేశం పార్టీకి మరో మంత్రి పదవి ఇచ్చే విషయమై భాజపా అగ్రనాయకత్వం ప్రధాని మోడీతో చర్చించినట్టు సమాచారం.
ప్రస్తుత పరిస్థితిలో తెలుగుదేశానికి ఇంకో పదవి సాధ్యం కాదని భాజపా వర్గాలు చెప్తున్నా, కొందరు దేశం ఎంపీలు మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.అయితే జరగబోయే చేర్పులు మార్పులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్లో మోడీ తన మంత్రి వర్గానికి ఆతిధ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.