కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం విదితమే.ఈ మహమ్మారి తో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు.
కరోనా బారిన పడిన కొందరు ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నారు.అయితే అలాంటి వారిలో వత్తిడి అనేది బాగా ఉంటుంది.
ఈ మహమ్మారి నుంచి మనో ధైర్యం తో ఎలా బయటపడాలి అన్న దానిపై వారిలో ధైర్యం నింపడం కోసం వైద్యం అందించే నర్సులు వినూత్న రీతిలో రోగులను మోటివేట్ చేస్తున్నారు.కరోనా రోగుల్లో ఒత్తిడిని వదిలించి, ధైర్యం నింపే క్రమంలో వారంతా కలిసి జుంబా డ్యాన్స్ లు చేశారు.
రోగులను కాసేపు ఉల్లాస పరిచడం కోసం నర్సులు అందరూ జుంబా డ్యాన్స్ చేశారు.రోగులకు సేవలు అందిస్తున్న తమకేం కాదు తప్పకుండా ఈ కరోనాను జయిస్తాం అనే స్థైర్యాన్ని వారికి అందించారు.
కెన్యాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు జుంబా డ్యాన్స్ చేసి ఆసుపత్రిలో ఒక్కసారిగా జోష్ నింపేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే నర్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.కుటుంబాలను వదిలి 24 గంటలు కరోనా రోగుల సేవల్లో తరిస్తున్న నర్సుల్లో ఆందోళనను తగ్గించడానికి ఇదో ప్రయత్నమని అధికారులు అంటున్నారు.
నర్సులందరూ మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జుంబా డ్యాన్స్లో పాల్గొన్నారు.మొత్తం 50 మంది ఆరోగ్య కార్యకర్తలు రెండు గంటల పాటు జుంబా డ్యాన్స్ చేసినట్లు తెలుస్తుంది.
కాగా, కెన్యాలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 912కు చేరుకోగా, 50 మంది మృతి చెందారు.అలానే గడిచిన 24 గంటల్లో కెన్యాలో 25 కేసులు నమోదైనట్టు సమాచారం.