ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పొంగి పోర్లుతోంది.భద్రాచలం వద్ద 53 అడుగులకు ప్రవాహం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.
భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఇక భద్రాద్రి రామయ్య ఆలయ తూర్పు మెట్ల వరకు నీరు చేరింది.
ఇప్పటికే రామన్న ఆలయ అన్నదాన సత్రం, కల్యాణకట్ట, స్నానఘట్టాలు నీట మునిగాయి.
గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.
ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రమాద స్థాయి దాటవచ్చని తెలిపింది.దీంతో నది పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా వరద ఉధృతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్షిస్తున్నారు.ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.సహాయక చర్యల కోసం రాష్ట్రస్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు.