ఈ సృష్టికి మూలం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని మనం భావిస్తాం.ఈ సృష్టిలో మన తల రాతలు రాసి ప్రాణం పోసేది బ్రహ్మ దేవుడుగా పరిగణిస్తారు.
అలాంటి బ్రహ్మ దేవుడికి ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలో మనకు దర్శన మిస్తుంటాయి.మన తల రాతలు రాసే బ్రహ్మదేవుడే తానే స్వయంగా తన తల రాతను మార్చుకుని ఓ ఆలయంలో కొలువై ఉన్నాడు.
ఇంతకీ ఆలయం ఎక్కడుంది?బ్రహ్మ ఈ విధంగా తన తలరాతను మార్చు కోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలం తానేనని ఎంతో గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు.ఎలాగైనా తన గర్వాన్ని అనచాలన్న ఉద్దేశంతో ఆ పరమశివుడు తన ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదవ తలను ఖండిస్తాడు.
అంతేకాకుండా బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోతావు అని కూడా బ్రహ్మదేవున్ని శపిస్తాడు.దీంతో తన తప్పును గ్రహించిన బ్రహ్మదేవుడు తనకు శాపవిమోచనం కలగాలని తీర్థ యాత్రలు చేయడం ప్రారంభిస్తారు.

ఈ విధంగా తీర్థ యాత్రలు చేస్తున్న బ్రహ్మదేవుడు ఒకరోజు తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తిరుపత్తూర్ ప్రాంతంలో ఉన్న బ్రహ్మపురికి చేరుకొని ఆలయంలో ఉన్న బ్రహ్మపురీశ్వరాలయం చుట్టూ 12 శివలింగాలను ఏర్పాటు చేసి పూజిస్తారు.ఈవిధంగా శాప విమోచన కోసం బ్రహ్మదేవుడినీ చూసిన పార్వతీ పరమేశ్వరులు అతనికి శాపవిమోచన కలిగించి తిరిగి తన నిర్మాణ సృష్టిని కల్పిస్తారు.ఆ విధంగా శివుడు బ్రహ్మపురీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.
బ్రహ్మదేవుడు స్వయంగా తన తల రాతను ఈ ఆలయంలో తిరిగి రాసుకోవడం వల్ల శివుడు అతనికి సలహా ఇస్తాడు.ఎవరైనా భక్తులు ఈ ఆలయంలో తనను పూజిస్తే వారికి ఎలాంటి కష్టాలు లేకుండా అంతా మంచి జరగాలని వారి విధిరాత మార్చాలని శివుడు బ్రహ్మ దేవునికి సూచించాడు.అప్పటి నుంచి బ్రహ్మ స్వయంగా తన తల రాతను మార్చుకున్న ఈ ప్రదేశంలో తను సృష్టించిన 12 లింగాలను దర్శించిన భక్తులు తలరాత మారుతుందని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం.