కరోనా వైరస్ కు మందు వచ్చేసింది ఇక మనం అందరం సేఫ్ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నంత సమయం పట్టలేదు మళ్ళీ ప్రపంచం మొత్తం ఆందోళనలోకి నెట్టడానికి.కరోనా రూపు మారుచుకుందని, కరోనా 2.0 అని, స్ట్రెయిన్ అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకుని పిలుచుకుంటున్న ఈ సరికొత్త మహమ్మారి దెబ్బకి మళ్ళీ యావత్ ప్రపంచం వణికిపోవడం మొదలు పెట్టింది.ఈ వైరస్ ప్రభావం ఎలా ఉండబోతోంది అనే ఆందోళనలను వ్యక్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.
అయితే ఈ మహమ్మారి విషయంలో ఎలాంటి భయందోళనలు అవసరం లేదని అంటున్నారు ఇండో అమెరికన్, బిడెన్ టీమ్ లోకి ఎన్నికయిన సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.
బ్రిటన్ లో మొట్టమొదటి సారిగా ఈ మహమ్మారి వెలుగు చూసిందని, ఇది ప్రాణాంతక మహమ్మారి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని వివేక్ మూర్తి అంటున్నారు.
ఈ కొత్త వైరస్ ప్రాణంతకం అని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని మూర్తి తెలిపారు.కొత్త వైరస్ స్ట్రెయిన్ లో 70 శాతం ఇన్ఫెక్షన్లు ఉంటాయని చెప్పడానికి ఎలాంటి పరిశోధనలు జరగలేదని అన్నారు.
అయితే ఇది వ్యాప్తి చెందటంలో మాత్రం కరోనా మహమ్మారి కంటే వేగంగా జరుగుతోందని ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు.
ఈ వైరస్ సోకినా వారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినట్టుగా ఇప్పటివరకూ కూడా ఎలాంటి ఆధారాలు లేవని ఓ న్యూస్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివేక్ మూర్తి తెలిపారు.అయితే కరోనా మహమ్మారి సమయంలో ఇప్పటికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అవే జాగ్రత్తలు తీసుకోవాలి అని పిలుపు ఇచ్చారు.తప్పనిసరిగా విధిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించడం వలన ఎలాంటి వైరస్ నుంచి అయినా బయటపడగలమని తెలిపారు.
.