పైకి అంతా బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నా, తెలంగాణ బిజెపిలో గ్రూప్ వార్ బాగా ముదిరిపోయింది.ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య అంతర్గతంగా ఆధిపత్యపోరు నడుస్తున్నట్లు గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు అవి నిజం కాబోతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఆగస్టు 9వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.దీని కోసమే కొత్త కమిటీలను నియమించుకున్నారు.
అంతా రెడీ కావడంతో ఇక పాదయాత్ర చేపట్టడం ఒకటే మిగిలి ఉంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద్ యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈ జన ఆశీర్వాద యాత్ర కిషన్ రెడ్డి సొంతంగా రూపొందించుకుంది కాదు బిజెపి కేంద్ర పెద్దల నిర్ణయం మేరకు దీన్ని చేపట్టబోతున్నారు.
కొత్తగా మంత్రులుగా ఎంపికైనవారు ప్రజల్లో పట్టు సంపాదించి, బీజేపీకి కలిసి వచ్చేలా చేయాలని ,ఈ మేరకు ఒక్కో కేంద్రమంత్రి దాదాపు నాలుగు లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ఈ యాత్రను అధిష్టానం రూపొందించింది.ఈ మేరకు ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
అయితే ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఈ యాత్రకు ఎంపీలంతా హాజరుకావాలని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేయడంతో, బండి సంజయ్ ఇప్పుడు తన యాత్రను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
సంజయ్ యాత్ర వాయిదా పడడానికి ప్రత్యక్షంగా కిషన్ రెడ్డి కారణం కాకపోయినా, పరోక్షంగా కారణం కావడంతో , సంజయ్ ను దెబ్బకొట్టేందుకు కిషన్ రెడ్డి ఈ విధంగా ఏం చేస్తున్నారు అంటూ సంజయ్ వర్గీయులు మండిపడుతున్నారు.అయితే ఈ వ్యవహారంలో కిషన్ రెడ్డి ప్రేమేయం ఏదీ లేదు అని సంజయ్ కు తెలుసు కాబట్టే, ఆయన సైలెంట్ అయిపోయారు.అయితే 9వ తేదీన తన పాదయాత్ర చేపట్టేందుకు అవకాశం లేని పక్షం లో 24వ తేదీన తన యాత్రను ప్రారంభించాలని, దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే ఆలోచనలో సంజయ్ ఉన్నారట.
సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరూ ఈ పాదయాత్ర ద్వారానే తమ బలం నిరూపించుకునేందుకు సిద్ధం అవుతుండడం తో తెలంగాణ బీజేపీ లో పాదయాత్రల రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.