జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.హైదరాబాద్ లో ఆదివారం ప్రత్యేకంగా భేటీ.
రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు.ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాలు, వచ్చే ఎన్నికల వ్యూహాలే ప్రధాన అజెండాగా సమావేశం.
ఉమ్మడి మేనిఫెస్టో, సమన్వయంపైనా ప్రణాళిక.భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆదివారం రాత్రి ప్రత్యేక భేటీ హైదరాబాద్ లో జరిగింది.జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు.సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కీలక భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరు పార్టీల అధినేతలు చర్చించారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
భేటీ అనంతరం వివరాలను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాకు వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగింది.అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయి.వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి.? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నాం.
భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించాం.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారు.వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగింది.
అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతాం’’ అన్నారు.