పురుగుల మందు తాగి అటవీశాఖ అధికారిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మహబూబ్ నగర్ కు చెందిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ మహిళా అధికారిణి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఖిల్లా ఘన్ పూర్ కు చెందిన వహీదాబేగం (32) మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ లోని అటవీశాఖ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్నారు.ఈమె భర్త భానుప్రకాశ్ జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్.
వీరికి మూడేళ్ల కూతురు ఉంది.అయితే భానుప్రకాశ్, వహీదాబేగం డిగ్రీలో ప్రేమించి వివాహం చేసుకున్నారు.
ఈ మధ్యకాలంలో భానుప్రకాశ్ కు డిగ్రీ కళాశాలలో చదివే మరో స్నేహితురాలితో పరిచయం ఏర్పడింది.అది కాస్త ప్రేమకు దారి తీసింది.దీంతో భాను ప్రకాశ్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానని వహీదాబేగంకు చెప్పడంతో గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్నాయి.ఈ మేరకు బుధవారం రాత్రి కూడా గొడవ జరగడంతో మానసిక ఒత్తిడికి లోనైన వహీదా పురుగుల మందు తాగింది.
చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు నిర్ధారించారు.కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.