ఈ మధ్యకాలంలో జనసేన నుంచి ప్రచారంలోకి వచ్చిన స్లొగన్ ‘ ఎవడ్రా ఆపేది ‘ జనసేన అభిమానులు కట్టే ఫ్లెక్సీల్లో ఈ స్లోగన్ ఈ మధ్యకాలంలో తలుచుగా కనిపిస్తోంది. జనసేన అధికారంలోకి రాకుండా ఎవడ్రా ఆపేది అన్నట్లుగా అభిమానులు ఉత్సాహం పెంచే విధంగా ఈ స్లొగన్ ఉంది .
అయితే ఇప్పుడు నిజంగా ఆపేది ఎవడ్రా అన్నట్లుగానే జనసేనాని రాజకీయం మొదలుపెట్టారు.ఇప్పటి వరకు టిడిపికి అనుకూల వ్యక్తిగాను , ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారని వైసిపి ఎప్పుడూ విమర్శలు చేస్తూనే వచ్చేది.
దీనికి తగ్గట్లుగానే పవన్ వ్యవహార శైలి ఉంటూ వచ్చింది.ఏపీలో వైసిపి ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమన్నట్లుగా పవన్ ప్రకటనలు చేస్తూ వచ్చారు. బిజెపి తనకు సరైన రూట్ మ్యాప్ ఇవ్వలేదని, అప్పట్లో ప్రకటించి సంచలనం సృష్టించారు.ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా, లేనట్టుగానే ఉంటూ వచ్చింది.
ఇటీవల విజయవాడలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం అనంతరం మార్పు కనిపించింది.తప్పనిసరిగా జనసేన, టిడిపిలు కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు.
కానీ కొద్ది రోజుల క్రితం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోది పవన్ ను పిలిపించుకుని అనేక అంశాలపై చర్చించారు.ఇక సమావేశం ముగిసిన తర్వాత టిడిపికి దూరంగా ఉంటున్నట్టుగానే కనిపిస్తున్నారు.ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, లేక ఆ పార్టీకి మద్దతు పలికినా, తనకు ఎప్పటికీ సీఎం కూర్చి దక్కదనే విషయాన్ని పవన్ ప్రధాని తో భేటీ తర్వాత గ్రహించారు.2024 ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా ఉంటే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, కానీ మళ్ళీ 2029 ఎన్నికల నాటికి వైసిపికి ఛాన్స్ ఉంటుందని జనసేన మరింతగా బలహీనమవుతుందనే విషయాన్ని బిజెపి పెద్దలు సూచనతో పవన్ గ్రహించారు.
అందుకే టిడిపికి దూరంగానే ఉండాలని 2024 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు.అవసరమైతే ఎన్నికల ఫలితాలు తర్వాత టిడిపి మద్దతుతో బిజెపి సహకారంతో సీఎం కుర్చీలో కూర్చోవచ్చు అనే ఆలోచనతో పవన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే ఇప్పటివరకు వైసీపీని వ్యతిరేకించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అంటూ చెబుతూ వచ్చిన పవన్ మాటల్లో ఇప్పుడు స్పష్టంగా మార్పు కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని , ఈసారి ఆచితూచి అడుగులు వేస్తానంటూ పవన్ చెబుతుండటం చూస్తుంటే , పవన్ కు అసలు రాజకీయం ఏంటో ఇప్పటికైనా అర్థం అయినట్టే కనిపిస్తోంది.