ఏపీ సినిమా టికెట్ల వ్యవహారం గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.హీరో నాని ఏపీ టికెట్ రేట్లతో పోలిస్తే థియేటర్ల పక్కన ఉండే కిరాణా షాపుల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు చేశారు.
అయితే హీరో నాని కామెంట్ల గురించి ఇప్పటికే పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి ఘాటుగా బదులిచ్చారు.తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హీరో నాని ఎవరో తెలియదని మంత్రి చెప్పుకొచ్చారు.తనకు తెలిసిన నాని కేవలం కొడాలి నాని అని మంత్రి కామెంట్లు చేశారు.
టికెట్ రేట్లు తగ్గించడం వల్ల తమ పారితోషికం తగ్గుతుందని హీరోలు భావిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.అభిమానుల స్థాయి నుంచే మేము కూడా ఈ స్థాయికి వచ్చామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ప్రొడక్షన్ కు 30 శాతం ఖర్చు అయితే రెమ్యునరేషన్ 70 శాతంగా ఉందని మంత్రి తెలిపారు.
గతంలో చారిత్రాత్మక సినిమా తీశామని ఖర్చు ఎక్కువగా ఉందని చెప్పి రేట్లు పెంచాలని కోరేవారని మంత్రి అన్నారు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు పెట్టిన ఖర్చు ఎంత? పవన్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంత? అని మంత్రి ప్రశ్నించారు.ప్రజలను ఉద్దరిస్తానన్న పవన్ కళ్యాణ్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా? అని మంత్రి కామెంట్లు చేశారు.ఒకప్పుడు తాను బైక్ అమ్మి పవన్ కు కటౌట్లు పెట్టానని మంత్రి తెలిపారు.తన దగ్గర ఉన్న డబ్బులను ఊడగొట్టుకున్నానని మంత్రి చెప్పుకొచ్చారు.
సినిమాకు అయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకి వెళుతున్నాయని దానికోసం కోట్ల మంది ప్రజలపై భారం పెరిగేలా వ్యవహరించడం కరెక్ట్ కాదని మంత్రి చెప్పుకొచ్చారు.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.