మళ్లీ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ప్రభావం పెరిగినట్టు కనిపిస్తోంది.మొన్నటి వరకు లోకేష్ కు ప్రాధాన్యం పెంచుతూ, సీనియర్ నాయకులను పక్కన పెట్టినట్లు గా వ్యవహరించిన బాబు ఇప్పుడు మాత్రం సీనియర్ నాయకుల ప్రాధాన్యం పెంచారు.
ఈ కారణంగా పార్టీ మరింతగా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో పాటు, ఇటీవల పార్టీ సీనియర్ నేతలు బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేస్తూ, సంచలన విషయాలు బయట పెడుతూ విమర్శలు చేయడం మరింత ఆందోళన పెంచింది.అందుకే ఇప్పుడు వారికి బాగానే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొన్నటి వరకు ఏపీ లో యాక్టిివ్ గా పర్యటించారు.వైసీపీ ప్రభుత్వం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ నాయకులు, ప్రజలను స్వయంగా వెళ్లి పరామర్శించారు.
తాను అండగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చారు.ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్న వెంటనే లోకేష్ స్పందించేవారు.ఎలాగూ రాబోయే ఎన్నికల్లో లోకేష్ కీలకం కావడంతో పాటు , ఆయనే మెయిన్ రోల్ పోషిస్తారు కాబట్టి, పార్టీలో నాయకులు అందరూ లోకేష్ మాటే వినాల్సి ఉంటుంది కాబట్టి చంద్రబాబు లోకేష్ ను బాగా ప్రోత్సహించారు. అయితే కొద్ది రోజులుగా లోకేష్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
ఎక్కడా ఆయన హడావుడి కనిపించడం లేదు.చంద్రబాబు మాత్రమే కీలక నిర్ణయాలు తీసుకుంటూ, ఆయన హైలెట్ అవుతున్నారు.
దీనికి కారణం వైసీపీ తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే బాధ్యతలు తీసుకోబోతున్నారు.కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రి మండలి సమావేశం జరిగిన సందర్భంగా ప్రశాంత్ కిషోర్ వైసిపి కోసం పని చేయబోతున్నారు అంటూ స్వయంగా జగన్ చెప్పిన దగ్గర నుంచి చంద్రబాబు కూడా మరింత అలెర్ట్ అయ్యారు.
ఈ సమయంలో లోకేష్ చేతుల్లో టిడిపిని పెడితే ప్రశాంత్ కిషోర్ టీం మరింత దూకుడు చూపించి, టిడిపిని విమర్శల పాలు చేయడానికి చూస్తారని , అందుకే 2024 ఎన్నికల్లో ను పూర్తిగా తానే అన్ని వ్యవహారాలను నడిపించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.అందుకే పార్టీ సీనియర్ నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ, వారి సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.అందుకే ముందుగా లోకేష్ తో సైకిల్ యాత్ర చేయించాలని బాబు చూసినా ఇప్పుడు దానిని పక్కనపెట్టి తాను మాత్రమే బస్సు యాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం , తనను పక్కన పెట్టి సీనియర్ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి వ్యవహారాలు లోకేష్ కు అసంతృప్తిని కలిగించాయట .అందుకే ఆయన సైలెంట్ అయిపోయారు అనే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.