జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది నెలలుగా సైలెంట్ గానే ఉంటున్నారు.అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పించి పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు.
ఆయన మౌనం వెనుక కారణాలు ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.ఒక వైపు బిజెపి ఒక సందర్భంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంకో సందర్భంలో ప్రాధాన్యం లేకుండా చేయడం వంటి విషయాలు పవన్ ఇబ్బంది పెడుతున్నాయి.
దీనికి తోడు జాతీయ స్థాయిలో బీజేపీ పై వచ్చిన వ్యతిరేకత రాబోయే రోజుల్లో తమ కూటమి పై తప్పకుండా ప్రభావం చూపిస్తుందనే భయమూ పవన్ లో ఉంది.ఆ భయంతోనే ఇప్పుడు తాను వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో తమకు ఏకైక శత్రువు జగన్.మళ్లీ ఆయనను అధికారంలోకి రాకుండా చేయకపోతే జనసేన అడ్రస్ గల్లంతు అవుతుందనే టెన్షన్ పవన్ లో ఉంది.అందుకే టీడీపీని కలుపుకుని వెళ్లాలనే ఆలోచన పవన్ చేస్తున్నారట.బిజెపి-జనసేన ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి వెళ్లినా, పెద్దగా కలిసి వచ్చేది ఏమీ ఉండదని, టిడిపి కూడా తమతో కలిస్తే బలమైన శక్తిగా ఏపీలో ఉంటామని, తప్పకుండా జగన్ ను అధికారానికి దూరం చేయవచ్చని , మళ్ళీ తమ కూటమి అధికారంలోకి వస్తుంది అనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.2014లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయి.2024లోనూ అదే రిపీట్ అవుతుందని పవన్ అభిప్రాయపడుతున్నారట.అందుకే బీజేపీని టిడిపిని కలిపే బాధ్యతను పవనే తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే టిడిపి తో తాము కలిసేది లేదు అని ఇప్పటికే అనేకసార్లు బిజెపి నేతలు ప్రకటించారు.
కేవలం ఏపీ బీజేపీ నేతలే కాదు, జాతీయ నాయకులు భవిష్యత్తులోనూ టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదు అంటూ ప్రకటించారు.అయితే జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేసి, తమ కూటమి అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా టిడిపి ని కలుపుకు వెళ్లాల్సిందే అనేది పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.ఇప్పుడు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించే బాధ్యతనూ పవన్ భుజాన వేసుకున్నారట.