కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకూతలం చేసిందో మనకు తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వ అకస్మాత్తు లాక్ డౌన్ తో ఒక్కసారిగా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
అన్ని వర్గాల వారు ఎవరి స్థాయిలో వారు నగదు కోసం ఇబ్బంది పడ్డా గూడు కోసం ఎవరూ ఇబ్బందిపడలేదు.గూడు కోసం ఇబ్బందిపడ్డ వారు ఎవరైనా ఉంటే వారు వలస కార్మికులనే చెప్పవచ్చు.
ఎందుకంటే వారిది వేరే రాష్ట్రం, పొట్టకూటికి వలస వచ్చిన వలస కార్మికులకు ఇక్కడ ఎవరూ పరిచయం ఉండరు.ఇక్కడ వారికి ఎటువంటి హక్కులు ఉండవు.
ఒక వైపు యజమాని వెళ్లిపోవాలని చెప్పడం, ఇటు పనిలేక డబ్బులు లేక పస్తులుంటున్న పరిస్థితులలో ఇక గత్యంతరం లేక కాలినడకన వారు తమ ఊళ్ళకు పిల్లాపాపలతో కలిసి ముల్లెమూటలతో నడక ప్రారంభించారు.
ఎవరూ ఆదుకోక నడుస్తున్న మార్గంలోనే ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికులు కూడా ఉన్నారు.
ఈ కష్టకాలంలోనే వారి పాలిట దేవుడయ్యాడు నటుడు సోనూసూద్.స్వంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేసి, కొంత నగదు ఇచ్చి వారి స్వంత ఊళ్ళకు పంపించారు.ఆ సమయంలో దేశమంతా సోనూసూద్ ను ప్రశంసలతో ముంచెత్తింది.అయితే తాజాగా మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు సోనూసూద్.నాగపూర్ సమీపంలోని ఓ గ్రామ ప్రజలు తమకు ఇంటర్నెట్ సౌకర్యం లేదనే విషయాన్ని సోనూసూద్ దృష్టికి తీసుకొచ్చారు.వారి వినతిని మన్నించి సోనూసూద్ ఆ గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయించారు.
.