భిక్షాటన చేయడం అనేది అత్యంత నీచమైన వృత్తిగా ఉంటుంది.అయితే ప్రతి దేశంలో కనీసం ఒక 5 నుంచి 10 శాతం ప్రజలు ఏదో ఒక రూపంలో బిక్షాటన వృత్తిగా చేసుకొని బ్రతుకుతూ ఉంటారు.
ఇండియాలో అయితే చాలా కుటుంబాలలో చిన్న వయస్సు నుంచి పిల్లలని బిచ్చగాళ్ళుగా మార్చేసి రోడ్డు మీదకి పంపిస్తారు.చాలా రాష్ట్రాలలో భిక్షాటన ఒక మాఫియాగా కూడా ఉంది.
పిల్లలని కిడ్నాప్ చేయడం, వారికి అవయవాలు పోయేలా చేసి బిచ్చగాళ్ళుగా మార్చేయడం చేస్తూ ఉంటారు.ఎంతో మంది ఆనాధలు ఇలా బిచ్చగాళ్ళుగా మారిపోతూ ఉంటారు.
అయితే కొందరు కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తే, కొందరు ఇదే వృత్తిగా చేసుకొని కోట్లు సంపాదిస్తూ ఉంటారు.ఇలా కోట్లు సంపాదించే వాళ్ళు ఇండియాలో కంటే విదేశాలలో ఎక్కువగా ఉంటారు.
వికలాంగులుగా నటిస్తూ భిక్షాటన చేసుకొని కోట్లు సంపాదిస్తారు.కొందరు ఖరీదైన కార్లలో వచ్చి డ్రెస్సులు మార్చుకొని భిక్షాటన చేస్తారు.
ఈజిప్టులో నఫీసా అనే 57 ఏళ్ల వృద్ధురాలు దివ్యాంగురాలిగా నటిస్తూ వీల్చైర్లో కూర్చుని భిక్షాటన చేస్తోంది.భిక్షాటన ముగిసిన తర్వాత ఎవరూ లేనప్పుడు వీల్చైర్ను పక్కన పెట్టేసి, ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లిపోతోంది.
దీనిని గమనించిన కొందరు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆమెను అరెస్ట్ చేశారు.పక్షవాతం కారణంగా తాను ఓ కాలును కోల్పోయినట్టు ఆమె చెప్పింది.
అయితే, అది వాస్తవం కాదని విచారణలో తేలింది.దీంతో ఆ మహిళ గురించి ఆరా తీయగా షాకయ్యే విషయాలు వెలుగుచూశాయి.గర్బియా, ఖలిబుయా గవర్నరేట్స్ ప్రాంతాల్లో ఆమెకు పలు ప్రాంతాల్లో ఐదు నివాస భవనాలు ఉన్నాయని, ఆమె రెండు బ్యాంకు ఖాతాల్లో మూడు మిలియన్ ఈజిప్షియన్ పౌండ్లు, భారత కరెన్సీలో దాదాపు 1.42 కోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.దీంతో ఆమెని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.భిక్షాటన ద్వారానే ఆమె ఆ స్థాయిలో డబ్బు సంపాదించిందా లేదా ఇంకా ఏవైనా ఇల్లీగల్ వ్యాపారాలు ఉన్నాయా అనే విషయాన్ని కూపీ లాగుతున్నారు.