రెండు నెలల క్రితం బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన యంగ్ హీరో “సుశాంత్ సింగ్ రాజ్ పుత్” పలు మానసిక ఒత్తిడులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ ఘటన అనంతరం బాలీవుడ్ సినిమా పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి అవకాశాలు రాకుండా చేయడం వల్లనే అతడు మానసిక ఒత్తిడికి లోనయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడని అంటూ పలు ఆరోపణలు చేశారు.
అంతేగాక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి గతంలో సుశాంత్ నుంచి దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగా అక్రమంగా తన ఖాతాలో జమ చేయించుకుందని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రియా చక్రవర్తి ని అరెస్టు చేశారు.
అయితే రియా చక్రవర్తి అరెస్టు అనంతరం విచారణలో డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు బయటకు వచ్చింది.
దీంతో ప్రస్తుతం పోలీసులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు ని పక్కనపెట్టి డ్రగ్స్ కేసు పై పూర్తి దృష్టి సారించారు.దీనికితోడు ఇటీవలే కొంతమంది బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు తాము సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో స్పందిస్తూ పేరు మోసిన బడా దర్శకులు సాజిద్ ఖాన్, అనురాగ్ కశ్యప్ తదితరులపై ఆరోపణలు చేస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో బాలీవుడ్ సినిమా పరిశ్రమకి క్రేజ్ తగ్గనుందని అంతేగాక నూతన నటీనటులు కూడా సినిమా పరిశ్రమలోకి రావాలంటే కొంతమేర భయపడుతున్నారని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులే మరింతకాలం పాటు కొనసాగితే భవిష్యత్తులో బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని, కాబట్టి ఇప్పటికైనా సినీ పరిశ్రమలోని పెద్దలు ఈ విషయంపై స్పందించి సినిమా పరిశ్రమలో జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి చర్చించి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అలాగే ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో “నెపోటిజం” ఎక్కువగా ఉందని దీనివల్ల సినీ ప్రముఖులు తమ బంధువులు, స్నేహితులకే సినిమా అవకాశాలను వచ్చే విధంగా చూస్తున్నారని దీనివల్ల నూతన నటీనటులు అవకాశాలకు ముప్పు వాటిల్లుతుందని కాబట్టి సినిమా పరిశ్రమలో ఉన్న నెపోటిజం ని కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక సినిమా పరిశ్రమలో బంధుప్రీతి కి కాకుండా టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులను ప్రోత్సహించాలని ఇలా చేయడం వల్ల భావితరాలకు మంచి జరుగుతుందని అంటున్నారు.