ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.అర్ధరాత్రి ఎప్పుడో ఆన్ లైన్లో ఇసుక బుకింగ్ ఓపెన్ చేసి రెండు నిమిషాల్లో అయిపోయిందని చెబుతున్నారు.
అది ఎవరికి వెళ్తుందో తెలీడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.ఇది ఇలాగే జరిగితే టీడీపీకి తగిలినట్లే వైసీపీకు ఇసుక దెబ్బ తగలడం ఖాయమని హెచ్చరించారు.
జనసేన సోషల్ మీడియాకు ఇచ్చిన పార్ట్ -3 ఇంటర్వ్యూలో ఇసుక కొరత, ఈబీసీ రిజర్వేషన్ల రద్దు వంటి ఆంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఒక ముడి సరుకు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షగా మారిపోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు.ఇలాంటి సమయాల్లో సామాన్యుడికి గృహ నిర్మాణం కలగా మిగిలి పోతుందని జనసేనాని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంలో అవకతవకలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు.మరోవైపు స్వర్ణకారులు, ఫోటోగ్రాఫర్లు, టూరిజం మీద ఆధారపడే ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారి ఉపాధి అవకాశాలు చెల్లా చెదురై పోయాయని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.