విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని అమ్మాయి సుఖ పడుతుందని ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలకు ఇచ్చి తమ కుమార్తెలకు పెళ్లిళ్లు చేస్తున్నారు.తీరా అక్కడికి వెళ్లిన తర్వాత భర్త చేతుల్లో చిత్రహింసలకు గురవ్వడం సర్వసాధారణమైంది.
ఎంతోమంది ఆడబిడ్డలు వరకట్న వేధింపులకు బలైన సంఘటనలు కోకొల్లలు.ఇలాంటి వారికి సాయం చేసుందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఐ సెల్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ (డబ్లుఎస్డబ్ల్యూ)ను గతేడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ విభాగానికి ఇప్పటి వరకు 70కు ఫిర్యాదులు అందాయి.వీటిలో 29 కేసులు దర్యాప్తులో ఉండగా.41 కేసులు విచారణ దశలో ఉన్నాయి.ఐదు కేసులలో ఎన్ఆర్ భర్తలపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.
అలాగే ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురి పాస్పోర్ట్లను ప్రభుత్వం రద్దు చేసింది.దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బాధితుల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు గాను ఎన్ఆర్ఐ సెల్లో అధికారులు గురువారం రెండు రోజుల వర్క్ షాప్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీఎస్ ఐటీ సెల్ తన వాయిస్ ఓవర్ యాప్తో పాటు సర్వీసెస్ ఆఫ్ టీఎస్ ఎన్ఆర్ఐ సెల్ పేరిట ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ (డబ్ల్యూఎస్డబ్ల్యూ) ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.ఎన్నారై కేసుల దర్యాప్తు విషయంలో నిర్దేశిత ప్రామాణాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.విదేశాలలో గృహ హింసను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆడపడుచుల కోసం తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమీషన్ హైదరాబాద్లో కేసులు నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
స్వచ్చంధ సంస్థలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోమ్ శాఖ, జాతీయ మహిళా కమీషన్, వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సహకారంతో ఎన్ఆర్ఐ వివాహితల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్ పనిచేస్తోంది.