కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘మహానటి’.అలనాటి నటి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటోంది.
తమిళంలో ‘నడిగయర్ తిలగం’ పేరుతో మే 9న ఈ సినిమా విడుదలైంది.విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది.
‘మహానటి’ చిత్రంలో సావిత్రి జీవితాన్ని అందంగా చూపించారని ఆమె కుటుంబసభ్యులు సైతం కొనియాడారు.అయితే.
ఈ సినిమాలో తన తండ్రి జెమినీ గణేశన్ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కుమార్తె కమలా సెల్వరాజ్ మండిపడుతోంది.
‘సినిమాలో మా నాన్న పాత్రను తప్పుగా చూపించారు.
జెమినీ గణేశన్ అలిమేలును కాకుండా సావిత్రినే ఎక్కువగా ప్రేమించినట్లు ఎలా చూపిస్తారు? అలిమేలుపై గణేశన్కు ప్రేమే లేదన్నట్లుగా చూపించారు.ఆ విషయం మీకెలా తెలుసు? అలిమేలు, గణేశన్కు ఇద్దరు పిల్లలున్నారనే విషయం మరిచిపోయారా?’ అని కమలా సెల్వరాజ్ ప్రశ్నించారు.

సినిమా మొత్తంలో జెమినీ గణేశన్ను ఓ విలన్గా చేసి చూపించారని కమల మండిపడ్డారు.అందులో ఏమాత్రం నిజంలేదని ఆమె స్పష్టం చేశారు.‘సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీ గణేశనే అన్నట్లు చూపించారు.సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు పేరున్న నటులు ఆమెను పట్టించుకోలేదని చెప్పబోయారు.ఇవన్నీ తప్పు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
‘నాకు తెలిసినంతవరకు సావిత్రికి మా నాన్న అంటే అస్సలు ఇష్టం లేదు.
ఆమెకు ఈ విషయంలో ఎంత కోపం అంటే.ఓ సారి మేము సావిత్రి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె మాపైకి తన పెంపుడు కుక్కల్ని వదిలారు.ఓ మనిషి జీవితం గురించి 3 గంటల్లో ఎలా చెప్పేస్తారు?’ అంటూ చిత్ర బృందంపై కమల ఆగ్రహం వ్యక్తం చేశారు

గణేశన్, అలిమేలు దంపతుల కుమార్తె అయిన కమలకు చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్గా గుర్తింపు ఉంది.1993లో ఆమె ఉత్తమ వైద్యురాలిగా అవార్డు అందుకున్నారు.దక్షిణాదిన తొలి టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించిన వైద్యురాలు కమలే కావడం విశేషం.1990లో ఆమె ఈ ఘనత సాధించారు.
సావిత్రి తన చివరి రోజుల్లో దుర్భర జీవితాన్ని ఎదుర్కోవడానికి జెమినీ గణేశనేనని చాలా మంది భావిస్తున్న తరుణంలో కమల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.సావిత్రి పట్ల గణేశన్ ఎన్నో తప్పులు చేశారని, సినిమాలో చూపెట్టింది చాలా తక్కువేనని అభిమానులు చెబుతుండటం గమనార్హం.