ఏపీ టీడీపీ నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది.ఇది ప్రతిపక్ష వైసీపీ నుంచి కాకుండా మిత్రపక్షమైన బీజేపీ నుంచి రావడం మరింత కలవరపెడుతోంది.
ప్రతిపక్ష శిబిరంపైనే కాక మిత్రపక్ష పార్టీలోనూ ఏం జరుగుతోందో ఒక కన్నేసి ఉంచడం రాజకీయాల్లో అత్యంత కీలకం! మరీ ముఖ్యంగా ఉప్పు-నిప్పులా ఉన్న టీడీపీ-బీజేపీ మధ్య ఇది మరింత అవసరం!అందుకే బీజేపీపై ఫుల్ ఫోకస్ పెట్టారు.ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలని ఒకపక్క బీజేపీ పెద్దలు తలమునకలై ఉంటే.
టీడీపీ నేతలు ఆసక్తిగా వీటిని గమనిస్తున్నారు.ఎవరు తమకు ప్లస్ అవుతారు, ఎవరు మైనస్ అవుతారో అని లెక్కలేసుకుంటూ.తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
2019 ఎన్నికలకు సమయం ముందుకొస్తుండటంతో ఏపీపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది.కొంత కాలంనుంచీ ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిఎవరికి కట్టబెట్టాలనే అంశంపై ఇంకా మల్లగుల్లాలు పడుతోంది.అయితే ఇప్పుడు టీడీపీ కూడా దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టింది.ఏపీ బీజేపీలో పెద్దయెత్తున మార్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతుండటంతో బీజేపీ నేతలకన్నా ఇప్పుడు టీడీపీ నేతలకే టెన్షన్ ఎక్కువగా ఉంది.వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో టీడీపీ కొంత డీలా పడింది.
కేంద్రమంత్రివర్గ విస్తరణ, పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకంపై టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొని ఉంది.కేంద్రమంత్రి పదవి విశాఖ ఎంపీ హరిబాబుకు దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హరిబాబు కేంద్రమంత్రి వర్గంలోకి వెళితే పార్టీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది.కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడి నియామకం పెండింగ్ లోనే ఉంది.కానీ ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక తప్పని పరిస్థితి.హరిబాబు కేంద్రమంత్రి వర్గంలోకి వెళితే బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి పేర్లు వినిస్తున్నాయి.
ఈ ముగ్గురూ చంద్రబాబుకు వ్యతిరేక వర్గం వారేనన్నది బహిరంగ రహస్యమే.కేంద్రమంత్రి వర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నా అది టీడీపీకి మింగుడు పడని విషయమే.
దీంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి వర్గ విస్తరణపై టీడీపీ నేతల్లో టెన్షన్ బయలుదేరింది.
ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కన్నా, సోము, పురంధేశ్వరికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని గట్టిగా టీడీపీ లాబీయింగ్ ప్రారంభించింది.
గోకరాజు గంగరాజు పేరును టీడీపీ వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది.ఈ ముగ్గురిలో ఎవరికి పదవి ఇచ్చినా పొత్తు, మిత్రధర్మం సజావుగా సాగదని ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత ఒకరు అమిత్ షాకు సూచించినట్లు తెలిసింది.
ఆయన మాత్రం కార్యకర్తల అభిప్రాయం మేరకే తాము అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని చెబుతున్నారు.అమిత్ షా ఏపీ టూర్ కు వచ్చినప్పుడు కీలక కార్యకర్తల సమావేశంలో అభిప్రాయాలు సేకరించి అధ్యక్ష ఎన్నికను పూర్తి చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.