ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక రైలు ఏకంగా 35 కిలోమీటర్ల మేర రివర్స్ లో ప్రయాణించింది.కానీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు.
ఏదైనా తేడా జరిగినట్లయితే ప్రయాణికులు రైళ్ల చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయే వారు.ఈ భయంకరమైన ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలుసుకుంటే.
మార్చి 17 బుధవారం రోజున పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తనక్పూర్ కి బయలుదేరింది.
అయితే ఆ రైలు కొంత దూరం బాగానే ముందుకు ప్రయాణించింది కానీ ఒకానొక సమయంలో ఉన్నపలంగా ట్రయిన్ రివర్స్ లో ప్రయాణించడం ప్రారంభించింది.
దీంతో ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు ఏమవుతుందో తెలియక ఒక్కసారిగా భయపడిపోయారు.ట్రైన్ వెనుదిరిగి ప్రయాణిస్తున్నంతసేపు ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సమయం గడిపారు.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో అదే రైల్వే ట్రాక్ పై మరేతర రైలు రాకపోవడంతో గండం తప్పింది.ట్రాక్ పై ప్రజలు కూడా ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం వాటిల్లలేదు.
అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు.చంపావత్ ఎస్పీ లోకేశ్వర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.“అకస్మాత్తుగా జంతువులు రైలు పట్టాలపైకి రావడంతో లోకో పైలట్ సడన్ గా బ్రేక్ వేశారు.సడన్ గా బ్రేక్ వేయడం తో ట్రైన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.ఈ టెక్నికల్ ప్రాబ్లం కారణంగానే రైలు ముందుకు వెళ్లాల్సింది పోయి రివర్స్ గేర్ లో వెనక్కి వెళ్ళింది.35 కిలోమీటర్ల వరకు దానికి అదే రివర్స్ లో ప్రయాణించింది.చివరికి అదంతట అదే కటిమా అనే ప్రాంతంలో ఆగిపోయింది.కటిమా ప్రాంతం ఢిల్లీ కి 330 కిలోమీటర్ల దూరంలో ఉంది.దీంతో ట్రయిన్ లో ఉన్న 60 మంది ప్రయాణికులను దించేసి.బస్సుల ద్వారా వారందరినీ తమ స్వస్థలాలకు పంపించాము,” అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈ ఘటనకు బాధ్యులైన లోకో పైలట్, గార్డు లను ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.రైలు ఎందుకు వెనక్కి ప్రయాణించింది అనే విషయం తెలుసుకునేందుకు టెక్నికల్ టీం బరిలోకి దిగింది.